రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇటీవలి కాలంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ప్రమాదాలతో రోడ్డు నెత్తురోడుతున్నాయి. దాదాపుగా ప్రతిరోజు ఎక్కడో ఒకచోట రహదారులపై ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎక్కువగా మలుపుల దగ్గర రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎంతోమంది ప్రమాదాల బారినపడి ప్రాణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ప్రమాదాల సంఖ్య ఎక్కువగా కనిపిస్తుంది. 2019లో రోడ్డు ప్రమాదాలవల్ల 6,946 మంది మృతిచెందగా, 21,999 మంది గాయపడ్డారు. 2020 జూన్ 30 నాటికి తెలంగాణవ్యాప్తంగా 8,712 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాల ఫలితంగా 2,592మంది మృతిచెందారు.
మితిమీరిన వేగంతో వాహనాలు నడపడమే రోడ్డు ప్రమాదాలకు కారణం అంటున్నారు నిపుణులు. వాహనం స్పీడ్ ఎక్కువైతే, ఏదైనా అడ్డం వచ్చి బ్రేక్ వేస్తే…పరిస్థితి ఉల్టాపల్టా అవుతుంది. స్పీడ్ కారణంగా సదరు వాహనం బ్యాలెన్స్ తప్పుతుంది. దీంతో సహజంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. కారులో ప్రయాణించే వారందరూ సీట్ బెల్ట్ పెట్టుకోవాలన్నది నిబంధన. అయితే ఈ నిబంధనను చాలా మంది పట్టించుకోవడం లేదు. చాలా మంది, సీట్ బెల్ట్ పెట్టుకోవడాన్ని చిన్నచూపుగా భావిస్తున్నారు. సీట్ బెల్ట్ పెట్టుకుంటే, కారు యాక్సిడెంట్కు గురైనా, ఎయిర్ బ్యాగ్స్ తెరచుకుంటాయి. సహజంగా ప్రాణాలు కోల్పోవడం జరగదు. గాయాలతో బయటపడతారు. మద్యం తాగి వాహనం నడిపితే ప్రమాదాన్ని కోరితెచ్చుకోవడమే. పోలీసు అధికారులు ఈ విషయం పదేపదే చెబుతున్నారు. అయితే చాలా మంది మద్యం తాగి వాహనాలు నడుపుతున్నారు. దీంతో మద్యం ప్రభావం కారు నడిపేవారి మీద పడుతోంది. ఫలితంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. నిద్రలేకపోవడం కూడా రోడ్డు ప్రమాదాలకు మరో కారణం అంటున్నారు నిపుణులు. సహజంగా చాలా మంది రాత్రి అంతా వాహనాలను నడుపుతూనే ఉంటారు. కొన్ని నిమిషాలపాటు కూడా నిద్రపోయారు. దీంతో తెల్లవారుజామున వాహనం నడిపేవారిపై నిద్రలేమి ప్రభావం పడుతుంది. చివరకు ప్రమాదం జరుగుతుంది. ఈ నేపథ్యంలో లాంగ్ డ్రైవ్లో వెళ్లేవారు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. కొన్ని గంటల తరువాత తప్పనిసరిగా మరో వ్యక్తి డ్రైవింగ్ సీటులో కూర్చోవాలని సలహా ఇస్తున్నారు.
ఇదిలాఉంటే చాలా రోడ్డు ప్రమాదాలు చలికాలంలో జరుగుతున్నాయి. చలికాలంలో రోడ్లపై మంచు ఎక్కువగా పరచుకుంటుంది. దీనివల్ల కొన్ని మీటర్ల అవతల ఏముందో కూడా కారు నడిపేవారికి కనపడదు. రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరగడానికి ఇదొక కారణం అంటున్నారు నిపుణులు. కొన్ని సందర్భాల్లో పాదచారులు నిర్లక్ష్యంగా రోడ్డుపై నడుస్తుంటారు. రోడ్డు దాటుతుంటారు. అలాంటి సమయాల్లో రోడ్డు ప్రమాదాలు జరుగుతాయి. ఈ నేపథ్యంలో రోడ్లపై నడిచేటప్పుడు ఎవరైనా సరే.. ఒకటికి రెండు సార్లు ఆ దారిలో వాహనాలు వస్తున్నాయో, రావడం లేదో అని చూసుకోవాలి.అంతా ఓకే అనుకున్నాకే …రోడ్డు దాటాలి. సాధ్యమైనంత వరకు జీబ్రా లైన్ల నుంచే పాదచారులు రోడ్డు దాటాలి. అలాగే పాదచారుల కోసం వాహనాలు వేగంగా వెళ్లే ప్రాంతాల్లో రోడ్లపై సూచిక, హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలి. ప్రమాదాలు బాగా జరిగే చోట హెచ్చరిక బోర్డులను విరివిగా ఏర్పాటు చేయాలి. పాదచారులు రోడ్డును దాటేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సంబంధిత అధికారులు వారికి అవగాహన కల్పించాలి. ఆటోలు, కార్లు, తుఫాన్ లాంటి వాహనాలలో డ్రైవర్లు పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కిస్తుంటారు. ఇది అందరూ చూస్తున్న తతంగమే.కొన్ని సందర్భాల్లో డ్రైవర్కే చోటు లేనంతగా వాహనాలు కిక్కిరిసి పోతుంటాయి. అయితే ఇలా ప్రయాణికులను ఎక్కించడం ప్రమాదకరం. ఇలాంటి సందర్భాల్లో రోడ్డు ప్రమాదాలు జరిగేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే ప్రయాణికులు కూడా కిక్కిరిసిన వాహనాల్లో ప్రయాణించకుండా జాగ్రత్త పడాలి.
మన దేశంలోని అనేక ప్రాంతాల్లో ఉన్న జాతీయ, రాష్ట్ర ప్రధాన రహదారుల నిర్మాణంలో అనేక లోపాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యమైన ప్రదేశాల్లో అనేక లోపాలున్నాయి. క్రాసింగ్లు సరిగ్గా కనిపించకపోవడం, సిగ్నల్స్ లేకపోవడం, సూచిక బోర్డులు, హెచ్చరిక చిహ్నాలు ఉండకపోవడం, డివైడర్లు లేకపోవడం.. వంటి అనేక నిర్మాణాల వల్ల కూడా రోడ్డు ప్రమాదాలు అధికంగా జరుగుతున్నా యని పరిశోధనల్లో వెల్లడైంది. కనుక ఈ దిశగా కూడా సంబంధిత అధికారులు, ప్రభుత్వాలు ఆలోచించి పక్కా ప్రణాళికతో ముందుకు సాగాలి. రోడ్ల నిర్మాణాల్లో లోపాలు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటే.. రోడ్డు ప్రమాదాలను కొంత వరకైనా నివారించవచ్చు. హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డ కొంతకాలంగా రోడ్డు ప్రమాదాలకు కేరాఫ్ అడ్రస్గా మారింది. ఎక్కువగా సంపన్న కుటుంబాలకు చెందిన పిల్లలకు అధునాతన బైక్లతో ఓఆర్ఆర్ పై విన్యాసాలు చేసే దుర్మార్గమైన ట్రెండ్ ఇటీవలికాలంలో పెరిగింది. స్పీడ్ను విపరీతంగా పెంచుతున్నారు. రయ్ రయ్ మంటూ…ఓఆర్ఆర్ పై కుర్రకారు దూసుకుపోతు న్నారు. ఈ నేపథ్యంలో ఏదైనా అకస్మాత్తుగా సదరు బైక్కు అడ్డు వస్తే పరిస్థితి ఘోరంగా మారుతోంది. బైక్ బ్యాలెన్స్ కోల్పోతోంది. చివరకు బైక్ నడిపే కుర్రాడు ప్రాణాలు కోల్పోతున్నాడు.
ఓఆర్ఆర్ పై జిగ్ జాగ్ డ్రైవింగ్ చేయడం చాలా మంది కుర్రాళ్లకు ఫ్యాషన్ గా మారింది. జిగ్ జాగ్ డ్రైవింగ్… చాలా డేంజరస్ అని ట్రాఫిక్ రంగ నిపుణులు గతంలో చాలాసార్లు హెచ్చరించారు. అయిన ప్పటికీ నలుగురిలో గొప్ప కోసం లైన్ల మధ్య జిగ్ జాగ్ డ్రైవింగ్ కు కుర్రకారు జై కొడుతున్నారు. చివరకు ప్రమాదపు అంచుల వరకూ వెళుతు న్నారు. మనదేశంలో ప్రాణాంతక వ్యాధులతో చనిపోతున్న వారి కంటే, రోడ్డు ప్రమాదాల ఫలితంగా ఉసురు కోల్పోతున్న వారే ఎక్కువగా ఉంటున్నారు. దీనికి ప్రధాన కారణం భద్రతా చర్యలను ప్రజలు పట్టించుకోకపోవడమే. ఇంటి గడప దాటి బయటి ప్రపంచంలోకి అడుగుపెట్టిన ప్రతి వ్యక్తీ, రోడ్ సేఫ్టీ రూల్స్ పాటించాలంటున్నారు నిపుణులు.రోడ్డు ప్రమాదాల నివారణకు రెండు తెలుగు రాష్ట్రాల్లోని పోలీసులు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రతి ఏడాది క్రమం తప్పకుండా భద్రతా వారోత్సవాలు జరుపుతున్నారు. రోడ్ సేఫ్టీ గురించి ప్రజలకు అవగాహన పెంచుతు న్నారు. ఏమైనా రోడ్డు ప్రమాదాల నివారణ ఒక్కరి బాధ్యత కాదు. అది అందరి బాధ్యత. అందరూ ఆ బాధ్యతను నిర్వర్తించాలి. అప్పుడే రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయి.