సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి తెలంగాణలో తీరని విషాదాన్ని నింపింది. పటాన్చెరు ఓఆర్ఆర్పై చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఆమె ప్రాణాలు కోల్పోయారు. తెల్లవాజామున ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. భారత్ రాష్ట్ర సమితి యువ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి పట్ల తెలంగాణ రాజకీయ వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది. లాస్య నందిత కంటోన్మెంట్ మాజీ ఎమ్మెల్యే సాయన్న కుమార్తె. కిందటి ఏడాది ఫిబ్రవరిలో సాయన్న గుండె పోటుతో మృతి చెందారు. దీంతో ఆ స్థానంలో లాస్య నందితను బీఆర్ఎస్ బరిలోకి దింపింది. కిందటేడాది నవంబర్ చివరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి లాస్య నందిత పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో 17,169 ఓట్ల మెజారిటీతో నందిత గెలుపొందారు.
యువ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి , భారత్ రాష్ట్ర సమితిలో విషాదం నింపింది. రాజకీయంగా ఎంతో భవిష్యత్తు ఉందని భావిస్తున్న తరుణంలో చిన్న వయసులో లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మరణించడాన్ని గులాబీ పార్టీ నేతలు జీర్ణం చేసుకోలేకపోతున్నారు. నిన్నటివరకు తమతో కలిసి పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్న లాస్య నందిత విగతజీవిగా మారడాన్ని గులాబీ పార్టీ తట్టుకోలేకపోతు న్నారు. నందిత మృతికి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. లాస్య నందిత మృతి కంటోన్మెంట్ నియోజకవర్గంలో తీరని విషాదాన్ని నింపింది. కంటోన్మెంట్ నియోజకవర్గానికి సాయన్న అనేకసార్లు అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహించారు. సాయన్న మృతి చెందడంతో ఆయన వారసురాలిగా లాస్య నందిత పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. సాయన్న బిడ్డ నందితను కంటోన్మెంట్ ప్రజలు తమ బిడ్డగానే భావించారు. ఎన్నికల్లో ఆశీర్వదించి శాసనసభకు పంపారు. అయితే తాము కన్నబిడ్డలా అభిమానించే నందిత ఇక లేరన్న విషయం విని కంటోన్మెంట్ ప్రజలు విషాదంలో మునిగిపో యారు.
లాస్య నందితను ఇటీవల వరుస ప్రమాదాలు వెంటాడాయి. ఇప్పటికే రెండుసార్లు గండాల నుంచి నందిత తప్పిం చుకున్నారు.గతంలో ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు నగరంలోని ఒక ప్రముఖ ఆస్పత్రికి వెళ్లిన సమయంలో నందిత లిఫ్ట్లో ఇరుక్కుపోయారు. కొన్ని గంటల పాటు లిఫ్ట్లోనే ఆమె ఉండిపోయారు. ఆ తరువాత సిబ్బంది ఆమెను బయటకు తీశారు. కొన్ని రోజుల కిందట నల్గొండలో జరిగిన కేసీఆర్ సభకు లాస్య నందిత హాజరయ్యారు. సభ అనంతరం హైదరాబాద్ తిరిగి వస్తుండగా, ఆమె ప్రయాణిస్తున్న కారు ఓ ఆటోను ఢీకొట్టింది. కారు ముందు వైపు కుడి భాగం బాగా దెబ్బతింది. ఆ ప్రమాదంలో ఎమ్మెల్యే లాస్య నందిత తలకు దెబ్బలు తగిలాయి. ప్రమాదం జరిగిన సమయంలో కారులో లాస్య నందితతో పాటు ఆమె సోదరి, ఇద్దరు భద్రతా సిబ్బంది ఉన్నారు.
ఆ ప్రమాదం జరిగి 10 రోజులు కాకుండానే ఇప్పుడు మళ్లీ లాస్య నందిత కారు ప్రమాదానికి గురైంది. లాస్య నందిత కారు డివైడర్ను బలంగా ఢీ కొట్టడంతో లాస్య నందిత అక్కడికక్కడే మృతి చెందారు. అభిమానులకు తీవ్ర శోకాన్ని మిగిలిస్తూ లాస్య నందిత అందరినీ విడిచి వెళ్లిపోయారు. యువ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి పట్ల బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. లాస్య నందిత మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటన్నారు. కేసీఆర్తో పాటు పలువురు గులాబీ పార్టీ నేతలు లాస్య నందిత మృతికి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. లాస్య నందిత మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. నందిత మృతి దురదృష్షకరమన్నారు. ఇదిలా ఉంటే మితిమీరిన వేగమే ఈ రోడ్డు ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.