ఏపీలో కూటమి సర్కార్ కొలువుదీరి పాలనను పరుగులు పెట్టిస్తోంది. అభివృద్ధి, సంక్షేమం దిశగా దూసుకెళ్తున్నారు. అయితే,.. నెల రోజుల పాలనలో తమ మార్క్ను ప్రదర్శిస్తూ తమ ఇంపాక్ట్ను చూపుతున్నారు పలువురు మంత్రులు. కొందరు అంతంత మాత్రంగా వ్యవహరిస్తున్నా.. నలుగురు మాత్రం యాక్షన్ కింగుల్లా తమ విధుల్లో సూపర్ ఫాస్ట్గా దూసుకుపోతున్నారు.
ఫుల్ యాక్షన్ మోడ్లో ఉన్న ఆ నలుగురు మంత్రల్లో జనసేన కీలక నేత , రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఒకరు. పౌరసరఫరాల శాఖలో తీసుకుంటున్న నిర్ణయాలు రాష్ట్ర ప్రజల మన్ననలు పొందున్నారు. ఏపీలో కూటమి సర్కార్ ఇలా కొలువుదీరిందో లేదో అలా జగన్ అక్రమాలపై కొరడా ఝుళిపించారు. ఇంకా మంత్రిగా బాధ్యతలు స్వీకరించక ముందే గుంటూరులో జరుగుతున్న రేషన్ బియ్యం అక్రమాల గుట్టురట్టు చేశారు. రాత్రికి రాత్రి గోదాములపై దాడులు, అక్రమ నిల్వలను స్వాధీనంతో మనోహర్ మార్క్ ఏంటో చూపించారు. అనంతరం కాకినాడలో జరుగుతున్న బియ్యం అక్రమ రవాణా పై ప్రత్యేకంగా దృష్టిపెట్టారు. ఇక పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించే విషయంలోనూ నాదెండ్ల మనోహర్ కీలకంగానే వ్యవహరించారు. ప్రస్తుతం మార్కెట్లో బియ్యం, కందిపప్పు, నూనెలు, ఉల్లిపాయలు వంటివి ధరలు మండిపోతున్న నేపథ్యంలో.. ఇవన్నీ పౌరసరఫరాల శాఖ పరిధిలోకి వస్తాయి. కాబట్టి ఈ విషయాన్ని కూడా నాదెండ్ల మనోహర్ సీరియస్ గా తీసుకున్నారు. ఎలాంటి ఫిర్యాదులు అందకపోయినా తానే స్వయంగా రంగంలోకి దిగి ఆయా నిత్యవసర సరుకులు రైతు బజార్ల ద్వారా తక్కువ ధరకు అందేలా చర్యలు తీసుకున్నారు.
ఇక మరో మంత్రి కూడా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు.. తన శాఖాపరమైన విషయాలతో పాటు ప్రతిపక్ష వైసీపీ చేసే విమర్శల విషయంలో కూడా ఎప్పటికప్పుడు కౌంటర్ ఎటాక్ చేస్తున్నారు. గత ఐదేళ్ల కాలంలో రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్ట్ లను వైసీపీ ఎంత నిర్లక్ష్యం చేసింది అనే విషయాన్ని ప్రజలకు తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ తన శాఖ వ్యవహారాలపై పూర్తి స్థాయి పట్టు సాధించే ప్రయత్నం చేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది.
ఆ తర్వాత స్థానంలో ఉంది ఐటి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. ఈయన కూడా ఎప్పటికప్పుడు ప్రజల సమస్యలు తెలుసుకుంటూ పరిష్కార దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలోనే మంత్రిగా బాధ్యతలు చెపట్టగానే తన నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండేందుకు ప్రజా దర్భార్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీంతో పాటు సోషల్ మీడియా ద్వారా తనకు వచ్చే సమాచారం ఆధారంగా కూడా అప్పటికప్పుడు స్పందిస్తూ నేనున్నాను అన్న భరోసానిస్తున్నారు. అయితే నారా లోకేష్ తన శాఖాపరమైన అంశాల కంటే అటు ప్రజాదర్బార్, ఇతర ప్రజాసంబంధ విషయాల్లో స్పందించటం ద్వారానే యాక్షన్ మోడ్ లో ఉన్నట్లు కనిపిస్తుంది. ఇక అత్యంత కీలకమైన హోమ్ శాఖను దక్కించుకున్న వంగలపూడి అనిత కూడా దూకుడుగా వ్యవహరిస్తూ దూసుకుపోతున్నారు. అనిత కూడా తన శాఖాపరమైన విషయాలతో పాటు.. విపక్షాలకు కౌంటర్ ఎటాక్ ఇస్తూ ఏమాత్రం తగ్గడం లేదు. జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత వరస సమీక్షలు పెట్టి తన శాఖలపై పూర్తి స్థాయి అవగాహన తెచ్చుకునే ప్రయత్నం చేశారు. తర్వాత మళ్ళీ ఆ దూకుడు కనిపించలేదన్న టాక్ రాజకీయ వర్గాల్లో సాగుతోంది.