ఈసారి లోక్సభ ఎన్నికల్లో 370 నియోజకవర్గాలను స్వంతంగా గెలుచుకోవాలని భారతీయ జనతా పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. 2019 ఎన్నికల్లో బీజేపీ 303 నియోజకవర్గాలు గెలుచుకుంది. వీటిలో 37 సీట్లలో బీజేపీ 50 వేల లోపు మెజారిటీతో గెలుచుకుంది. ఇందులో పది సీట్లు ఎస్సీ, ఎస్టీ రిజర్వుడ్ నియోజక వర్గాలు కాగా మిగిలినవి జనరల్ నియోజకవర్గాలు. అయితే ఈసారి ఈ 37 నియోజకవర్గాల్లో బీజేపీకి పెద్దగా సానుకూలత కనిపించడం లేదు. గెలుపు ఏమాత్రం నల్లేరు మీద నడక కాదు. ఈ నియోజక వర్గాలకు సంబంధించి పార్టీ ఏమాత్రం తప్పటడుగు వేసినా, ఆ ప్రభావం విజయావకాశాలను దెబ్బతీసే ప్రమాదం కనిపిస్తోంది. దీంతో బీజేపీ అగ్రనేతలు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నియోజకవర్గాలపై కమలం పార్టీ హస్తిన పెద్దలు ప్రత్యేక దృష్టి పెట్టారు.
ఉత్తర భారతదేశంలో కిందటిసారి ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో బీజేపీ సీట్లు దక్కించుకుంది. దీంతో బీజేపీకి కొత్తగా వచ్చే సీట్లు అంటూ ఏమీ కనిపించడం లేదు. స్వంతంగా 370 సీట్లు గెలుచుకోవడం కూడా కమలం పార్టీకి అంత సులభంలా కనిపించడంలేదు. 370 నియోజకవర్గాల్లో విజయదుందుభి మోగించాలంటే ముందుగా కిందటిసారి ఎన్నికల్లో వచ్చినవాటిని నిలబెట్టుకోవాలి. అంతేకాదు. కొత్తగా మరికొన్ని నియోజకవర్గాల్లో విజయం సాధించగలగాలి. అయితే ఇది అంత సులభమైన విషయం కాదు. దీనికోసం బీజేపీ అగ్రనాయకత్వం పెద్ద ఎత్తున కసరత్తు చేయాల్సి ఉంటుంది. 2019 ఎన్నికల్లో యాభై వేల లోపు మెజారిటీతో గెలిచిన నియోజకవర్గాలపై ఈసారి బీజేపీ ప్రత్యేక దృష్టి పెట్టింది. వాస్తవానికి 2019 లోక్సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ హవా వీచింది. అనేక నియోజకవర్గాల్లో లక్షల ఓట్ల మెజారిటీతో అభ్యర్థులు విజయం సాధించారు. అయితే ఈ హవాలోనూ ఈ 37 నియోజకవర్గాల్లో అభ్యర్థు లు సాదాసీదా మెజారిటీతో విజయం సాధించారు.
బొటాబొటీగా యాభై వేల ఓట్ల మెజారిటీతో గెలిచిన 37 మంది సిట్టింగ్ ఎంపీల్లో 13 మందిని బీజేపీ మార్చింది. 50 వేలలోపు మెజారిటీతో గెలుపొందిన అభ్యర్థుల్లో దక్షిణాదినగల కొప్పళ, చామరాజ్నగర్, తుముకూరు మినహా మిగిలినవన్నీ ఉత్తరభారతదేశాన ఉన్నవే. ఇందులో అత్యధికంగా ఉత్తరప్రదేశ్ నుంచి 13 నియోజకవర్గాలున్నాయి. వాస్తవానికి 2014 ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ లో 42.63 ఓట్ షేర్ తెచ్చుకుంది బీజేపీ. అలాగే 71 సీట్లు గెలుచుకుంది. కాగా 2019 ఎన్నికల్లో బీజేపీ ఓట్ షేర్ 49.97 కు పెరిగింది. ఓట్ షేర్ పెరిగినప్పటికీ, గెలిచిన సీట్ల సంఖ్య 62 కు పడిపోయింది. 2019 లోక్సభ ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ – సమాజ్వాదీ పార్టీ ఒక కూటమిగా పోటీ చేశాయి. దీంతో ఉత్తరప్రదేశ్లో బీజేపీ సీట్ల సంఖ్య తగ్గింది.
ఈసారి సమాజ్వాదీ పార్టీ- కాంగ్రెస్ ఒక కూటమిగా పోటీ చేస్తున్నాయి. ఈ కూటమిలో మరికొన్ని పార్టీలు కూడా ఉన్నాయి. అయోధ్య అంశం నేపథ్యంలో ఈసారి మొత్తం 80 సీట్లు తమవే అంటున్నారు కమలనాథులు. అయితే అదంత ఈజీ కాదన్న వార్తలు వస్తున్నాయి. తొలి విడత ఎన్నికల్లో 102 నియోజకవర్గాలకు పోలింగ్ ముగిసింది. తొలి విడత ఓటింగ్ సరళిని పరిశీలిస్తే.. కాషాయం వెలవెల బోయినట్లే అనే వార్తలు వస్తున్నాయి. తొలి విడత వరకు నరేంద్ర మోడీ మేజిక్. పనిచేయలేదన్న ఊహాగానాలు రాజకీయవర్గాల్లో గుప్పుమంటున్నాయి.నరేంద్ర మోడీ నినాదం. “ఇస్ బార్ 400 పార్” అనేది కేవలం నినాదంగా మిగులుతుందన్న ఊహాగానాలు పొలిటికల్ సర్కిల్స్లో చక్కర్లు కొడుతు న్నాయి. దీంతో భారతీయ జనతా పార్టీ స్వంతంగా కనీసం 370 సీట్లనైనా గెలుచుకుంటుందా అనే చర్చ రాజకీయవర్గాల్లో నడుస్తోంది.
తొలి విడత ఎన్నికల్లో 102 నియోజకవర్గాలు ఉండగా భారతీయ జనతా పార్టీ 77 సీట్లలో పోటీ చేసింది. తమిళనాడులో గతంలో అన్నాడీఎంకేతో పొత్తులో భాగంగా ఒక సీటు మాత్రమే బీజేపీ గెలుచుకుంది. అయితే ఈసారి రెండు ప్రధాన ద్రవిడ పార్టీలు డీఎంకే, అన్నాడీఎంకేకు బీజేపీ దూరంగా ఉంది. డీఎండీకె వంటి ఒకట్రెండు పార్టీలతో పొత్తు పెట్టుకుని బరిలో నిలిచింది. ఇన్నేళ్లూ ఏదో ఒక ప్రధాన ద్రవిడ పార్టీకి జూనియర్ పార్ట్నర్గా కొనసాగిన బీజేపీ ఈసారి ఎన్నికల్లో తమిళనాడులో స్వంతంగా అభివృద్ధి కావాలన్న నిర్ణయానికి వచ్చింది. ఈ కారణంతోనే స్వశక్తిని నమ్ముకుని, దాదాపు ఒంటరిగా బరిలోకి దిగింది. తమిళనాడులో సహజంగా ప్రధాన ద్రవిడ పార్టీలైన డీఎంకే, అన్నాడీఎంకేలదే హవా. గతంలో ద్రవిడ పార్టీలతో పొత్తు పెట్టుకుని కూడా లోక్సభ ఎన్నికల్లో కనీసం నాలుగైదు సీట్లు తెచ్చుకోలేకపో యింది కమలం పార్టీ. అయితే చిన్నచిన్న పార్టీలతో పొత్తు పెట్టుకుని బరిలోకి దిగిన …ఈసారి కనీసం ఒక్క సీటు గెలుచుకున్నా అది అద్భుతమే అంటున్నారు రాజకీయ పరిశీలకులు.