టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 12న ఉదయం 11 గంటల 27 నిమిషాలకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంగా విజయోత్సవ సభ కూడా నిర్వహించనున్నారు. ప్రమాణ స్వీకారానికి గన్నవరం ఎయిర్ పోర్టు సమీపం లోని కేసరపల్లి ఐటీ పార్క్ ను ఎంపిక చేశారు. మంగళగిరి ఎయిమ్స్ స్థలం కంటే ఐటీ పార్క్ స్థలం అనువైనదిగా టీడీపీ నేతలు భావించారు.
ప్రమాణస్వీకారం సభా స్థలాన్ని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, టీడీ జనార్దన్, మంతెన సత్యనారాయణ రాజు, పెందుర్తి వెంకటేశ్ తదితరులు పరిశీలించారు. ప్రధాని మోదీతోపాటు ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమం త్రులు, కూటమి నేతలు హాజరు కానున్నారు. పలువురు ప్రముఖులు హాజరుకానున్న నేపథ్యంలో 12 హెలిప్యాడ్లు, గ్యాలరీలు, రవాణా ఏర్పాట్లు చేపట్టాల్సి ఉంటుంది. సభ నిర్వహణ కోసం గన్నవరం సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్క్, మంగళగిరి ఎయిమ్స్ సమీపంలో బ్రహ్మానందపురం ఏసీసీ భూములను అధికారులు, టీడీపీ నేతలు పరిశీ లించారు. ఐటీ పార్క్ వద్ద స్థలాలు అనుకూలంగా ఉన్నాయని, అక్కడైతే 1.5 లక్షల వరకు ప్రజలు వీక్షించేందుకు అవకాశం ఉంటుందని అంచనా వేశారు. ప్రధాని మోదీ సహా వివిధ రాష్ట్రాల నేతలు హాజరు కానున్న నేపథ్యంలో.. భద్రత, రవాణా, ప్రజలకు సౌకర్యాల పరంగా ఐటీ పార్కు సమీపంలోని స్థలాల్లో అయితే బాగుంటుందని అభిప్రాయ పడ్డారు. విమానాశ్రయానికి ఎదురుగా చెన్నై-కోల్కతా జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న ఎనిమిది ఎకరాల స్థలాన్ని పరిశీలించి.. అక్కడ ముళ్ల కంపలను తొలగించాలని నాయకులకు సూచిం చారు. చంద్రబాబు తుది నిర్ణయం మేరకు ఏర్పాట్లు చేస్తామని పేర్కొన్నారు.