లోక్సభ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా ఐదో విడత పోలింగ్ ముగిసింది. దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 నియోజకవర్గాలకు పోలింగ్ నిర్వహించారు అధికారులు. దీంతో దేశవ్యాప్తంగా మొత్తం 428 నియోజకవర్గాలకు పోలింగ్ ముగిసింది.ఐదో విడతలో పశ్చిమ బెంగాల్లో అత్యధికంగా 73.14 శాతం పోలింగ్ నమోదైంది. కాగా జమ్మూ కాశ్మీర్లోని బారాముల్లా లోక్సభ నియోజకవర్గంలో రికార్డు స్థాయిలో 59 శాతానికి పైగా పోలింగ్ శాతం నమోదైంది.
ఓటుహక్కు వినియోగించుకోవడంపై భారతీయులు ఇప్పటికీ నిరాసక్తత ప్రదర్శిస్తూనే ఉన్నారు. దేశవ్యాప్తంగా మొదటి మూడు విడతల్లో పోలింగ్ శాతం తక్కువగా నమోదైంది. అయితే ఇటీవల ముగిసిన నాలుగో విడతలో పోలింగ్ శాతం కొద్దిగా మెరుగుపడింది. కాగా తొలి రెండు విడతల్లో పోలింగ్ శాతం భారీగా తగ్గింది. ఆ తరువాత జరిగిన రెండు విడతల్లో పోలింగ్ శాతం కాస్తంత మెరుగైంది. తాజాగా ఐదో విడతలో 59 శాతం పోలింగ్ శాతం నమోదైంది. ఐదో విడతలో ఓటు వేసిన వారిలో కేంద్రమంత్రులు పీయూష్ గోయల్, స్మృతి ఇరానీ , ప్రముఖ పారిశ్రామికవేత్తలు రతన్ టాటా, అనిల్ అంబానీ, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్లతో పాటు బాలీవుడ్ ప్రముఖులు అక్షయ్ కుమార్, అనిల్ కపూర్, షబానా అజ్మీ తదితరులున్నారు.
పోలింగ్ సందర్భంగా పశ్చిమ బెంగాల్లో కొన్ని చెదురుమదురు సంఘటనలు జరిగాయి. బేరక్పూర్, ఆరాంబాగ్, బనగావ్ తదితర చోట్ల తృణమూల్ కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పరస్పరం ఘర్షణలకు పాల్పడ్డారు. అయితే పోలీసులు సకాలంలో స్పందించి అల్లరి మూకలను చెదరగొట్టారు. దీంతో గొడవలు సద్దుమణిగాయి. కాగా మరికొన్ని చోట్ల ఈవీఎంలు పనిచేయలేదు. మొరాయించాయి. దీంతో కొంతసేపు పోలింగ్కు అంతరాయం ఏర్పడింది. ఈ సంఘటనలు మినహాయిస్తే మొత్తంగా ఐదో విడత పోలింగ్ ప్రశాంతంగానే జరిగింది. ఐదో విడత ప్రక్రియ ముగియడంతో ఇక అందరి దృష్టి ఆరో విడత ఎన్నికలపై పడింది. ఆరో విడత ఎన్నికల్లో భాగంగా మొత్తం 58 లోక్సభ నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహిస్తారు. దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఆరో విడత ఎన్నికలు జరుగుతాయి. మొత్తం 889 మంది అభ్యర్థులు ఆరో విడత ఎన్నికల బరిలో ఉన్నారు.
ఆరో విడతలో భాగంగా బీహార్లోని ఎనిమిది నియోజకవర్గాలకు పోలింగ్ నిర్వహిస్తారు. ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో వాల్మీకి నగర్, పశ్చిమ చంపారన్, తూర్పు చంపారన్, శివ్హర్, వైశాలి, గోపాల్గంజ్, సివాన్, మహారాజ్ గంజ్ ఉన్నాయి. ఈ ఎన్నికలు రాష్ట్రీయ జనతాదళ్ అగ్రనేత తేజస్వి యాదవ్, ముఖ్యమంత్రి, జేడీ యూ అధినేత నితీశ్ కుమార్ మధ్య హోరాహోరీ పోరుగా మారింది. ఇక ఢిల్లీ విషయానికొస్తే ఇక్కడ ఆరు నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. చాందినీచౌక్, నార్త్ ఈస్ట్ ఢిల్లీ, ఈస్ట్ ఢిల్లీ, న్యూ ఢిల్లీ, నార్త్ వెస్ట్ ఢిల్లీ, సౌత్ ఢిల్లీ నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతాయి. ఆమ్ ఆద్మీ పార్టీ తాజా పరిణామాల నేపథ్యంలో ఢిల్లీలోని ఆరు నియోజకవర్గాల్లో జరగనున్న ఎన్నికలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
హర్యానాలోని పది లోక్సభ నియోజకవర్గాలకు ఒకేసారి ఐదో విడతలో పోలింగ్ జరుగుతుంది. హర్యానాలో అంబాలా, కురుక్షేత్ర, సిర్సా, హిసార్, కర్నాల్, సోనిపట్, రోహ్తక్, భివానీ – మహేంద్రగఢ్, గురువావ్, ఫరీదాబాద్ నియోజకవర్గాలకు ఈనెల 25న ఎన్నికలు నిర్వహిస్తారు. పంటల మద్దతు ధరను చట్టబద్ధం చేయాలన్న డిమాండ్ హర్యానా ఎన్నికల్లో కీలకంగా మారింది. ఈ డిమాండ్ కోసం చాలాకాలం నుంచి హర్యానా రైతులు పట్టుబడుతున్నారు. కొన్ని నెలల కిందట ఢిల్లీ శివార్లలో జరిగిన రైతుల ఉద్యమం కూడా పంటల మద్దతు ధరను చట్టబద్ధం చేయాలన్న డిమాండ్ చుట్టూనే తిరిగింది. అయితే ఈ డిమాండ్ పై ఇప్పటివరకు నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించలేదు. దీంతో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై హర్యానా రైతులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. దీంతో, హర్యానా రైతులను సముదాయించడానికి కాషాయదళం ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో హర్యానాలోని పది నియోజకవర్గాల్లో ఈనెల 25న పోలింగ్ జరగబోతోంది.
ఒడిశాలో ఆరు నియోజకవర్గాలకు పోలింగ్ నిర్వహిస్తారు. పోలింగ్ జరిగే నియోజకవర్గాల్లో భువనేశ్వర్, పూరీ, ధేన్కనాల్, కియోంజిహార్, కటక్, సంబల్పూర్ ఉన్నాయి. ఒడిశా ముఖ్యమంత్రి, బిజూ జనతాదళ్ అధినేత ఈసారి జరుగుతున్న ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. బీజేపీ కూడా ఒడిశాలో మెజారిటీ లోక్సభ నియోజకవర్గాలను గెలుచుకోవాలని గట్టి పట్టుదలతో ఉంది. ప్రధాని నరేంద్ర మోడీ ఒడిశాలో విస్తృతంగా పర్యటించారు. ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, పేపర్లు చూడకుండా జిల్లా కేంద్రాల పేర్లు కూడా చెప్పలేరని ఎద్దేవా చేశారు. బిజూ జనతాదళ్ పాలనలో ఒడిశాలో ఏమాత్రం అభివృద్ది జరగలేదన్నారు. త
ఐదో విడత పోలింగ్ జరిగే జరిగే రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ కూడా ఉంది. మొత్తం 14 నియోజకవర్గాల్లో ఈసారి పోలింగ్ నిర్వహిస్తారు. ఇందులో బీజేపీ సీనియర్ నేత మనేకా గాంధీ పోటీ చేస్తున్న సుల్తాన్పూర్ కూడా ఉంది. అయితే మనేకా గాంధీ కుమారుడు వరుణ్ గాంధీకి ఈసారి పిల్భిత్ నుంచి టికెట్ ఇవ్వలేదు. ఒకదశలో మనేకా గాంధీకి కూడా టికెట్ ఇవ్వకపోవచ్చన్న ప్రచారం జరిగింది. అయితే చివరిక్షణంలో మనేకా గాంధీకి టికెట్ ఇచ్చింది బీజేపీ అగ్రనాయకత్వం. పోలింగ్ నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈసారి ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ – కాంగ్రెస్ ఒక జట్టుగా బరిలో నిలిచాయి. బీజేపీ, కొన్ని స్థానిక పార్టీలతో కలిసి ఈ ఎన్నికల్లో పోటీ చేస్తోంది.
పశ్చిమ బెంగాల్లో కూడా ఎన్నికలున్నాయి. ఐదో విడతలో భాగంగా బెంగాల్లో ఎనిమిది నియోజకవర్గాలో పోలింగ్ నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా ఝార్కండ్లో నాలుగు నియోజకవర్గాలు గిరిధ్, ధన్బాద్, రాంచీ, జంషెడ్పూర్ లలో ఈనెల 25న పోలింగ్ నిర్వహిస్తారు.