ప్రధానిగా, ఆర్థిక మంత్రిగా దేశ ఆర్థిక పరిస్థితిని కొత్త పుంతలు తొక్కించిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ దాదాపు 33 ఏళ్ల తర్వాత రాజ్యసభ సభ్యుడికా పదవీవిరమణ చేస్తున్నారు. 1991లో ఆర్థిక మంత్రిగా ఆయన ప్రారంభించిన ఆర్థిక సంస్కరణలతో దేశ భవిష్యత్ కొత్త మలుపు తిరిగింది. 2004 మే 22న ప్రధాని పదవి చేపట్టి పదేళ్లపాటు 21వ శతాబ్దిలో దేశాన్ని ముందుకు నడిపించిన విద్యావేత్త మన్మోహన్ సింగ్. ఇదే సమయంలో దాదాపు 25 ఏళ్లపాటు లోక్ సభకు ప్రాతినిధ్యం వహించిన సోనియాగాంధీ రాజ్యసభకు ఎన్నిక కావడం విశేషం. బెస్ట్ పార్లమెంటేరియన్ గా ప్రశంసలు అందుకున్న మేధావి మన్మోహన్ సింగ్.
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ 33 ఏళ్ల రాజ్యసభ పదవీ కాలం ముగిసింది. రాజ్యసభ సభ్యుడిగానే పదేళ్లు ప్రధానిగా ఉన్న ఏకైక నాయకుడు మన్మోహన్ సింగ్. సౌమ్యుడు, అపారవిద్యావంతుడు మన్మోహన్ సింగ్. 1932 సెప్టెంబర్ 26న ప్రస్తుత పాకిస్తాన్ లోని పంజాబ్ చక్వాల్ లో జన్మించిన మన్మోహన్ సింగ్ 1958లో కేంబ్రిడ్జి యూనివర్సిటీలో ఆర్థిక శాస్త్రం చదివి 1962 లో ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీలో డాక్టరేట్ పూర్తి చేశారు. చండీగఢ్ పంజాబ్ యూనివర్సిటీ, ఢిల్లీ యూనివర్సిటీ , ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ ప్రొఫెసర్ గా పనిచేసిన డాక్టర్ మన్మోహన్ సింగ్ 1976-80 మధ్య రిజర్వుబ్యాంక్ డైరెక్టర్ గా, 1982-1985 మధ్య ఆర్ బీఐ గవర్నర్ గా పనిచేశారు. ఆసియా అభివృద్ధి బ్యాంక్ లోనూ గవర్నర్ హోదాలో పనిచేశారు. ప్లానింగ్ కమిషన్ డిప్యూటీ చైర్మన్ గా, యూజీసీ చైర్మన్ గా, ప్రధాని ఆర్థిక సలహాదారుగా ఎన్నో బాధ్యతలు వహించారు.
1991 లో పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్నసమయంలో ఆర్థిక మంత్రి బాధ్యతలు చేపట్టిన డాక్టర్ మన్మోహన్ సింగ్.. ఆర్థికరంగంలో తనకు గల అపార అనుభవాన్ని ఉపయోగించి, గొప్ప ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. అప్పటికి దేశ ఆర్థిక వ్యవస్థ అత్యంత క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఒకదశలో దేశ అవసరాలకు బంగారు నిల్వలు కుదువపెట్టే పరిస్థితి నుంచి దేశాన్ని గట్టెక్కించిన మేధావి మన్మోహన్ సింగ్. ఆయన ప్రారంభించిన ఆర్థిక సంస్కరణలవల్లే.. ప్రస్తుతం ప్రపంచంలో నాల్గో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దుకోడానికి కారణ మయ్యాయి.
డాక్టర్ మన్మోహన్ సింగ్ 2004 మే 2న దేశ ప్రధానిగా చేపట్టి 2014 వరకూ కొనసాగారు. జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ తర్వాత అత్యంత సుదీర్ఘ కాలం పాటు ప్రధానిగా ఉన్నది ఆయనే. మన్మోహన్ సింగ్ 1991 అక్టోబర్ 1 నుంచి 2024 ఏప్రిల్ 3 వరకూ 33 ఏళ్లపాటు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఐదు పర్యాయాలు అసోం నుంచి తర్వాత 15 ఏళ్ల పాటు రాజస్థాన్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఎన్నడూ లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయకపోవడం విశేషం.
డాక్టర్ మన్మోహన్ సింగ్ ను ఎన్నో పురస్కారాలు వరించాయి. 1956లో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి ఆడమ్ స్మిత్ ప్రైజ్ అందుకున్నారు. 1987లో పద్మవిభూషణ్ పురస్కారం, 1993లో యూరో మనీ అవార్డు, ఉత్తమ ఆర్థిక మంత్రి అవార్డు, 1993,1994లో ఉత్తమ ఆర్థిక మంత్రిగా ఆసియానుంచి ఏషియా మనీ అవార్డు పొందారు. 2017లో ఇందిరాగాంధీ అంతర్జాతీయ అవార్డు అందుకున్నారు. 33 ఏళ్లపాటు రాజ్యసభ సభ్యుడుగా పనిచేసి విశ్రాంతి తీసుకుంటున్న ఆయనకు ఆల్ ద బెస్ట్ .