దేశమంతా ఒకే పార్టీని అధికారంలోకి తీసుకురావడమే జమిలి ఎన్నికల అసలు లక్ష్యం. జమిలి ఎన్నికలకు జై కొట్టడం అంటే రాజ్యాంగంలోని సమాఖ్య స్ఫూర్తికి గొడ్డలిపెట్టు. అంతేకాదు ప్రాంతీయ పార్టీలు తమ అస్థిత్వాన్ని కోల్పోవడం ఖాయం. ఇందులో ఎవరికీ రెండో అభిప్రాయం ఉండాల్సిన అవసరం లేదు. జమిలి ఎన్నికలను మనదేశంలో అనేక రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. దీంతో జమిలిపై ఏకాభిప్రాయం అసాధ్యమన్న విషయం కేంద్రానికి అర్థమైంది. ఈ నేపథ్యంలో మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నాయకత్వంలో ఓ కమిటీ వేసి మమ అనిపించింది నరేంద్ర మోడీ సర్కార్.
ఒకే దేశం – ఒకే ఎన్నిక. వినడానికి ఈ నివాదం చాలా బాగుంటుంది. కొంతవరకు ఆకట్టుకుంటుంది కూడా. అయితే వాస్తవానికి ఒకే దేశం – ఒకే ఎన్నిక అనేది కుట్రపూరిత నినాదం. ఒకే దేశం – ఒకే ఎన్నిక ప్రతిపాదనపై కేంద్రప్రభుత్వం చేసిన కసరత్తును పరిశీలిస్తే, జమిలి ఎన్నికల విషయమై ప్రధాని ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకున్నట్లు అర్థమవుతోంది. జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలను పరిశీలించడానికి మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నాయకత్వంలో ఒక కమిటీ ఏర్పాటు చేయడం అనేది నామ్కే వాస్తే అన్నట్లుగానే కనిపిస్తోంది. లోక్సభతో పాటు వివిధ రాష్ట్రాల్లో ఒకేసారి అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించడానికి సంబంధించి రామ్నాథ్ కోవింద్ కమిటీకి 21 వేలకు పైగా సలహాలు, సూచనలు అందినట్లు సమాచారం. అంతేకాదు, వీటిలో 80 శాతం సలహాలు ఏకకాలం ఎన్నికలను సమర్థించినట్లు సదరు కమిటీ అందచేసిన నివేదిక వెల్లడిస్తోంది. అసలు రామ్నాథ్ కోవింద్ నాయకత్వంలో కమిటీ ఏర్పాటు చేయడంపైనే అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. జమిలిపై రాజకీయపార్టీల, మేధావుల, ప్రజాసంఘాల అభిప్రాయాలను సేకరించామని ప్రజలను మభ్యపెట్టడానికే రామ్నాథ్ కోవింద్ కమిటీ ఏర్పాటు అనే విషయం అర్థం అవుతోంది. కాగా జమిలి ఎన్నికల ప్రతిపాదనకు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నాయకత్వంలోని కమిటీ జై కొట్టింది. ఇందుకు సంబంధించిన నివేదికను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఈ కమిటీ అందచేసింది. దీంతో జమిలి ఎన్నికలపై ముందు కెళ్లాలని నరేంద్ర మోడీ ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లు స్పష్టమైంది. అయితే ఎప్పటి నుంచి జమిలి ఎన్నికలను నిర్వహించాలనే అంశంపై రామ్నాథ్ కోవింద్ నాయకత్వంలోని ఉన్నతాధికార కమిటీ ఎటువంటి సిఫార్సు చేయలేదు. జమిలి ఎన్నికల ప్రతిపాదనను మనదేశంలోని అనేక రాష్ట్రాలు మొద ట్నుంచి వ్యతిరేకిస్తున్నాయి. దీంతో జమిలిపై ఏకాభిప్రాయం అసాధ్యమన్న విషయం కేంద్రానికి అర్థ మైంది. ఈ నేపథ్యంలో మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నాయకత్వంలో ఓ కమిటీ వేసి మమ అనిపించింది నరేంద్ర మోడీ సర్కార్. అంతిమంగా 2024 లోక్సభ ఎన్నికల తరువాత జరిగే రాష్ట్రాల అసెంబ్లీల కాలపరిమితి పూర్తికాలం ఉండకపోవచ్చు. ఇప్పటివరకు కేంద్రంలో ఒక పార్టీ అధికారంలో ఉంటే రాష్ట్రాల్లో వేరే పార్టీలు అధికారంలో ఉండటం మనం చూస్తున్నాం. అయితే జమిలి ఎన్నికల తరువాత కేంద్రంలో ఏ రాజకీయ పార్టీ పవర్లో ఉంటే రాష్ట్రాల్లోనూ అదే పార్టీ ప్రభుత్వాలు ఉండటానికే ఎక్కువ అవకాశాలున్నాయి. అంటే దేశంలో ప్రతిపక్షాలు అనేవే ఉండవు. అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రాల్లోనూ ఒకే జాతీయ పార్టీ హల్చల్ చేయడం ఖాయం.
జమిలి ఎన్నికల ప్రతిపాదన అంటే భారత రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని దెబ్బతీసే కుట్రే. రాజ్యాంగంలో పొందుపరచిన సమాఖ్య స్ఫూర్తికి ఎసరు పెట్టడమే తప్ప మరొకటి కాదు. అంతేకాదు జమిలి ఎన్నికల నిర్వహణతో ప్రాంతీయ పార్టీల ఉనికి దెబ్బతింటుంది అనే అభిప్రాయం నూటికి నూరుపాళ్లు వాస్తవం. జమిలి ఎన్నికల ప్రతిపాదనను మొదటినుంచి ప్రాంతీయ పార్టీల అధినేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సహజంగా లోక్సభ ఎన్నికలప్పుడు, జాతీయ అంశాలు తెరమీదకు వస్తుంటాయి.అలాగే అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు ఆయా రాష్ట్రాలకు సంబంధించిన అంశాలు తెరమీదకు వస్తుంటాయి. ఇప్పటివరకు జరుగుతున్న ఎన్నికల తీరు ఇది. ఇదిలాఉంటే,లోక్సభకు, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే స్థానిక అంశాలు గాలికి ఎగిరిపోతాయి. వాటిని ఎవరూ పట్టించుకోరు. కేవలం జాతీయ అంశాలే ప్రధానమవుతాయన్నది ప్రాంతీయ పార్టీల అధినేతలు వ్యక్తం చేస్తున్న ప్రధాన అభ్యంతరం. ఇక్కడో విషయం గమనించాలి. అనేక రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీకి గట్టి పోటీ ఇస్తోంది జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ కాదు, అక్కడి ప్రాంతీయ పార్టీలే. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్, ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ, తమిళనాడులో స్టాలిన్ నాయకత్వంలోని ద్రవిడ మున్నేట్ర కళగం, తెలంగాణలో భారత్ రాష్ట్ర సమితి.. జాతీయ పార్టీ అయిన కమలం పార్టీని దీటుగా ఎదుర్కొంటున్నాయి. ఇలా రాజకీయంగా కీలకమైన కొన్ని రాష్ట్రాల్లో బలమైన ప్రాంతీయ పార్టీలు, కమలం పార్టీకి చుక్కలు చూపిస్తున్నాయి. ఈనేపథ్యంలో తమ ఆధిపత్యాన్ని సవాల్ చేసే ప్రాంతీయ పార్టీల ఉనికిని దెబ్బతీసే కుట్రపూరిత ఆలోచనే జమిలి ఎన్నికల ప్రతిపాదన. వాస్తవానికి జమిలి ఎన్నికలు పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థకు పనికిరావు. కేవలం అధ్యక్ష తరహా పాలన కొనసాగుతున్న దేశాల్లోనే జమిలి ఎన్నికలు నడుస్తాయి. అంతేకాదు ఒన్ నేషన్ – ఒన్ ఎలెక్షన్ అంటే వివిధ రాష్ట్రాలలోని ప్రజలపై బలవంతంగా ఎన్నికలను రుద్దడమే. చివరకు దేశమంతా ఒకే పార్టీ అధికారంలో ఉంటుంది. ఇంకా మొహమాటం లేకుండా చెప్పాలంటే దేశంలో ప్రజాస్వామ్యం అంతమవుతుంది.భిన్నత్వంలో ఏకత్వం అనేది మాయవుతుంది. అంతిమంగా దేశం నియంతృత్వం వైపు పయనిస్తుంది.