ఆదిలాబాద్ పార్లమెంట్ నుంచి బరిలో ఉపాధ్యాయ వృత్తి నుంచి వచ్చిన వారు సై అంటే సై అంటున్నారు. ప్రధాన పార్టీలైన బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు ముగ్గురు రాజకీయాల్లోకి రాకముందు విద్యాబుద్ధులు నేర్పిన టీచర్లే. అయితే,.. తాము చేస్తున్న ఉపాధ్యాయ ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు ఆ ముగ్గురే పార్లమెంట్ ఎన్నికల బరిలో విజయం కోసం కాలుదువ్వుతున్నారు.
ఆదిలాబాద్ పార్లమెంట్ ఎన్నికల బరిలో పోటీకి సై అంటున్నారు ఉపాధ్యాయ వృత్తి నుంచి వచ్చిన లీడర్లు. బీజేపీ నుంచి గోడం నగేష్, బీఆర్ఎస్ నుంచి ఆత్రం సక్కు, కాంగ్రెస్ నుంచి ఎంపీ సోయం బాపూరావు ఈ ముగ్గురు పొలిటికల్ ఎంట్రీ ఇవ్వక ముందు టీచర్లుగా పని చేశారు. అయితే,.. రాజకీయాల్లోకి రావాలన్న కోరికతో ఉపాధ్యాయ వృత్తికి గుడ్బై చెప్పారు. బీజేపీ అభ్యర్థి గోడం నగేశ్ తండ్రి రామారావు టీడీపీ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అంతకుముందు ఆయన కూడా ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ స్వచ్ఛంద విరమణ చేసి టీడీపీలోకి వచ్చారు. 1989 నుంచి 1994 వరకు ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రిగా వ్యవహరించారు. 1994 ఎన్నికల్లో తండ్రి రామారావును కాదని పార్టీ ఆయన తనయుడు నగేశకు టికెట్ ఇచ్చింది. దీంతో నగేశ్ ప్రభుత్వ ఉపాధ్యాయ కొలువుకు రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చారు. మూడుసార్లు టీడీపీ నుంచి బోథ్ ఎమ్మె ల్యేగా గెలుపొందారు. 2014లో బీఆర్ఎస్ లో చేరి ఆదిలాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ఈసారి బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు.
ఇక బీఆర్ఎస్ అభ్యర్థి ఆత్రం సక్కు కూడా 1983 నుంచి 2008 వరకు ప్రభుత్వ ఉపా ధ్యాయుడిగా పనిచేశారు. స్వచ్ఛంద పదవీ విరమణ చేసి కాంగ్రెస్లో చేరిన ఆయన 2009 ఎన్నికల్లో ఆసిఫాబాద్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత 2014లో కాంగ్రెస్ నుంచి పోటీచేసి బీఆర్ఎస్ అభ్యర్థి కోవ లక్ష్మి చేతిలో ఓడిపోయారు. 2018లో కాంగ్రెస్ నుంచి పోటీచేసి ఎమ్మెల్యేగా రెండోసారి ఎన్నికయ్యారు. ఆ తర్వాత బీఆర్ఎస్లో చేరారు. ప్రస్తుతం పార్లమెంట్ అభ్యర్థిగా బీఆర్ఎస్ నుంచి పోటీలో నిలిచారు. ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలోకి వచ్చే ఏడు నియోజకవర్గాల్లో ఆదివాసీ సామాజిక వర్గానికి చెందిన ఓట్లు అధికంగా ఉండడం, ఇప్పటికి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలువడం.. గిరిజనుల్లో మంచి పేరు ఉండడంతో అధిష్టానం ఆత్రం సక్కును బరిలో దించింది.
ఇక కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణ కూడా ఉపాధ్యాయ వృత్తిని వదిలి రాజకీయాల్లోకి వచ్చిన నాయకురాలే. 2008 నుంచి ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న సుగుణ.. 13 ఏళ్ల సర్వీస్ ఉండగానే టీచర్ కొలువును పక్కనపెట్టి రాజకీయాల్లోకి వచ్చారు. ఇటీవలే స్వచ్ఛంద విరమణ చేసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుని ఎంపీ టికెట్ పొందారు. గత కొంతకాలంగా పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపారు ఆత్రం సుగుణ. పలు గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజలకు చేరువయ్యే కార్యక్రమాలు చేపట్టారు. ఇందులో భాగంగా ఏడు నియోజకవర్గ పరిధిలోని హస్తం పార్టీ నేతలతో కూడా సమావేశాలు నిర్వహిస్తూ వచ్చారు. అయితే ఈ టికెట్ కోసం మరికొందరు పోటీ పడ్డప్పటికీ చివరి నిమిషంలో సుగుణ అభ్యర్థితత్వానికే కాంగ్రెస్ హైకమాండ్ ఆమోదముద్ర వేసింది. మరి ఈ ముగ్గురిలో విజయం ఎవరిని వరిస్తుంది..? ఏ పార్టీ జెండా రెపరెపలాడనుందో తెలియాలంటే ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాల్సిందే.