తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం హీటెక్కిస్తున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ల మధ్య మాటల మంటలు రేపుతున్నాయి. ఎంపీ వర్సెస్ మంత్రి సీన్ మారింది. ఈనేపథ్యంలోనే పొన్నంపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. అసలు సంజయ్, ప్రభాకర్ల వివాదానికి కారణం ఏంటి..?
బీజేపీ ఎంపీ బండి సంజయ్, మంత్రి పొన్నం ప్రభాకర్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. వారిద్దరూ సవాళ్లు, ప్రతి సవాళ్లు విసరుకుంటున్నారు. రాబోయే లోక్సభ ఎన్నికల్లో కరీంనగర్ ఎంపీ స్థానాన్ని కాంగ్రెస్ సునాయాసంగా గెలుస్తుందని..తానే దగ్గరుండి గెలిపిస్తానని బండి సంజయ్ను ఓడగొడతానని పొన్నం సవాల్ విసిరారు. దీనిపై సంజయ్ పొన్నంకు ప్రతి సవాల్ విసిరారు. ఈసారి కూడా కరీంనగర్ ఎంపీగా తానే గెలుస్తానని, తాను గెలిస్తే పొన్నం రాజీనామా చేయడానికి రెడీనా అని సంజయ్ ప్రతి సవాలు విసిరారు.
సిద్ధిపేట జిల్లా కోహెడ, కరీంనగర్ జిల్లా చిగురుమామిడి ప్రజాహిత యాత్రలో పొన్నంపై బండి సంజయ్ తీవ్ర విమర్శలు చేశారు. బండి సంజయ్ వ్యాఖ్యలపై పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. ఎంపీగా కరీంనగర్ ప్రజలకు ఏం చేశావని నిలదీస్తే తనపై బండి సంజయ్ వ్యక్తిగత విమర్శలకు దిగారని ఫైర్ అయ్యారు. మరుసటి రోజు బొమ్మనపల్లి నుంచి యాత్ర చేపట్టారు బండి సంజయ్. అప్పటికే సంజయ్ వ్యాఖ్యలు వైరల్ కావడంతో నియోజకవర్గంలో వివిధ ప్రాంతాల నుంచి కాంగ్రెస్ కార్యకర్తలు అక్కడుకు చేరుకున్నారు. సంజయ్ యాత్రను అడ్డుకునేందుకు యత్నించారు. అప్పటికే ఇంటెలిజెన్స్ సమాచారంతో పోలీసులు, పారా మిలటరీ బలగాలు భారీగా మోహరించాయి. ఈనేపథ్యంలోనే బీజేపీ శ్రేణులు కూడా కాంగ్రెస్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. పోలీస్ పహారా మధ్యే సంజయ్ యాత్ర బొమ్మనపల్లి నుంచి రాములపల్లిలోకి ప్రవేశించింది.
దీంతో హుస్నాబాద్ నియోజకర్గంలో రోజంతా హైటెన్షన్ వాతావరణం నెలకొంది. తొలుత మంగళవారం ఉదయం కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం బొమ్మనపల్లిలో కాంగ్రెస్ శ్రేణులు సంజయ్ యాత్రను అడ్డుకునేందుకు యత్నించగా పోలీసులు వారిని నిలువరించారు. ఆ తర్వాత యాత్ర హుస్నాబాద్ మండలం రాములపల్లికి చేరుకోగా.. అక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు కోడిగుడ్లు, టమాటాలు విసరడంతో ఉద్రిక్తత నెలకొంది.
మంత్రి పొన్నంపై సంజయ్ వ్యాఖ్యలకు నిరసనగా జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనలు చేపట్టాయి. కరీంనగర్ ఇందిరాచౌక్లో సిటీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. సంజయ్ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. హుస్నాబాద్లోని అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ కార్యకర్తలు సంజయ్ దిష్టిబొమ్మకు ఉరివేసి నిరసన తెలిపారు. బీజేపీ ఫ్లెక్సీలను చించివేశారు. కరీంనగర్ సీపీకి, మానకొండూరు, హుజూరాబాద్, జమ్మికుంట పోలీస్ స్టేషన్లలో సంజయ్ పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఈ వివాదం ఇంతటితో ఆగుతుందా.. పార్లమెంట్ ఎన్నికల వేళ ఈ వ్యాఖ్యలు ఏటు దారి తీస్తాయో చూడాలి.