స్వతంత్ర వెబ్ డెస్క్: ఆరో రోజు వారాహి యాత్రలో భాగంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ మత్స్యకారుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కాకినాడ జిల్లా ఏటిమొగ్గలో పర్యటించారు. ప్రత్యేక బోటులో ఉప్పుటేరు మీదుగా వెళ్లి స్థానిక జాలరులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు ఎదుర్కొంటున్న పలు సమస్యలను జాలరులు పవన్ దృష్టికి తీసుకొచ్చారు. చేపల వేట విరామం వేళ ప్రభుత్వ జీవన భృతి అందడం లేదని వాపోయారు. చమురు పరిశ్రమల వల్ల నష్టపోతున్నామని జాలర్లు ఆవేదన వ్యక్తం చేశారు.
జాలరులతో భేటీ అనంతరం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. ‘‘మత్స్యకారుల్లోనూ ఎంతో మంచి స్మిమ్మర్లు ఉన్నారని, వారికి గనుక సరైన ప్రోత్సాహం అందిస్తే స్విమ్మింగ్ క్రీడలో రాణిస్తారని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. మత్స్యకారుల జీవనశైలికి ఆక్వాస్పోర్ట్స్ దగ్గరగా ఉంటాయని పేర్కొన్నారు. మత్స్యకార వృత్తిని వ్యవసాయంతో సమానంగా చూడాలని అన్నారు. సీఎం జగన్ లా అద్భుతాలు చేస్తానని చెప్పను గానీ, నేను మీ కోసం పనిచేస్తాను అని స్పష్టం చేశారు. మత్స్యకారుల వంటి ఉత్పత్తి కులాలకు ఇసుక వంటి సహజ ఖనిజాల కాంట్రాక్టులు ఇస్తే వారిలో ఆర్థిక అసమానతలు తొలగించవచ్చని పేర్కొన్నారు. మత్స్యకారులు సరైన నాయకులను ఎన్నుకోవాలని, మత్స్యకారులకు జనసేన అండగా ఉంటుందని పవన్ కల్యాణ్ తెలిపారు.
నేను ఎంతో నిబద్ధతతో జనసేన పార్టీని ప్రారంభించా. అధికారమే అంతిమ లక్ష్యం అనుకుంటే ఇంత కష్టపడాల్సిన పనిలేదు. నాకు ఉన్న సామర్థ్యానికి ఏదో పదవి పొందొచ్చు. ఇన్ని మాటలు పడాల్సిన అవసరం లేదు. ఈ సీఎంలాగా అద్భుతాలు చేస్తానని చెప్పడం లేదు. బటన్ నొక్కితే డబ్బులు పడతాయని కూడా చెప్పను. ఉప కులాల మధ్య ఐక్యత ఉండాలి. సరైన వ్యక్తులను మీరు నమ్మడం లేదు. బతికే హక్కు అందరికీ ఉంది. దానికి భంగం కలిగినప్పుడు పోరాడాల్సిందే. మీ విశ్వాసం సరైన వ్యక్తులపై పెట్టడం లేదు. రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తున్నా. వచ్చే ఎన్నికల్లో నన్ను గెలిపించండని అభ్యర్థిస్తున్నా. మీరు మద్దతు ఇవ్వండి.. అండగా ఉంటా’’ అని జనసేనాని తెలిపారు.