స్వతంత్ర వెబ్ డెస్క్: ప్రముఖ నటుడు మెగాస్టార్ చిరంజీవి కుటుంబంలో మూడో తరం అడుగిడింది. రామ్ చరణ్ – ఉపాసన దంపతులు తల్లిదండ్రులయ్యారు. మంగళవారం తెల్లవారుజామున జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో ఉపాసన ఆడబిడ్డకు జన్మనిచ్చారు. తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నట్లు అపోలో ఆస్పత్రి ఒక బులెటిన్ విడుదల చేసింది. మెగాస్టార్ ఇంట్లో మెగా ప్రిన్సెస్ అడుగుపెట్టనుండటంతో ఆ కుటుంబం సంబరాల్లో మునిగిపోయింది. వారసురాలి రాకతో మెగా కుటుంబంలో సంబరాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో వెల్కమ్ టూ ‘మెగా ప్రిన్సెస్’ అంటూ నెట్టింట ట్రెండ్ చేస్తూ శుభాకాంక్షలు చెబుతున్నారు మెగా అభిమానులు. కాగా, రామ్ చరణ్, ఉపాసనలకు 2012 లో వివాహం జరిగింది. ఈ దంపతులకు బిడ్డ పుట్టబోతున్నట్లు రెండు కుటుంబాలు గత ఏడాది డిసెంబర్ 12న వెల్లడించాయి. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం ఉపాసన సీమంతం వేడుకలను కూడా ఘనంగా నిర్వహించారు.