విశ్వవిఖ్యాత, పద్మశ్రీ నందమూరి తారక రామారావు 101 వ జయంతి సందర్భంగా కుటుంబ సభ్యులు, తెలుగు సినీ ప్రముఖులతో ఫిలింనగర్లో ఎన్టీఆర్ గారి విగ్రహం వద్ద జయంతి వేడుకలు చాలా ఘనంగా జరిగాయి. ప్రముఖులందరూ ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి జయంతి ఉత్సవాలను ఘనంగా జరిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నందమూరి మోహన్ కృష్ణ, నందమూరి మోహన్ రూప, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రెసిడెంట్ దామోదర్ ప్రసాద్, సెక్రటరీ ప్రసన్న కుమార్ ఫిలింనగర్ కల్చరల్ కమిటీ సెక్రటరీ మోహన్ ముళ్లపూడి తదితరులు హాజరయ్యారు.
కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి జోహార్ ఎన్టీఆర్ నినాదాన్ని వినిపించారు. కార్యక్రమం అనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసి నందమూరి తారక రామారావు 101 వ జయంతి వేడుకలు ఘనంగా జరిపించారు.
ఈ సందర్భంగా నందమూరి మోహనకృష్ణ మాట్లాడుతూ ‘‘మా నాన్నగారు ఎన్టీఆర్ గారు ఎందరికో స్ఫూర్తిదాయకుడు. ఎన్టీఆర్ అనే మూడు అక్షరాలు పలు సంచలనాలకు స్ఫూర్తి. అలాంటి స్ఫూర్తిదాయక వ్యక్తి 101 వ జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇటు సినీ రంగంలోనూ అటు రాజకీయ రంగంలోనూ ఎన్నో పెను సంచలనాలు సృష్టించారు. సినీ ఇండస్ట్రీలో ఆయన వేయని పాత్ర అంటూ లేదు. ఆయన తెలుగువారి ఆత్మగౌరవం కాపాడాలని తెలుగుదేశం పార్టీని స్థాపించారు. రాజకీయంగా ప్రజలకు ఎంతో సేవ చేశారు. అలాంటి వ్యక్తి ఎప్పటికీ మన హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు’’ అని అన్నారు.
ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మాట్లాడుతూ ‘‘ఎన్టీ రామారావు గారి 101 వ జయంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎన్టీఆర్ గారి కుటుంబం మోహన్ కృష్ణ గారికి మోహన్ రూప గారికి ధన్యవాదాలు. అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు. ఎన్టీఆర్ గారు విగ్రహం ఇక్కడ పెట్టడానికి ప్రసన్నకుమార్ గారు మోహన్ కృష్ణ గారు చాలా కష్టపడ్డారు. దేవుడు రూపంలో కృష్ణుడు రూపంలో ఎన్టీఆర్ గారు మనతో ఉన్నట్టుగా భావించే విగ్రహం ఇప్పటికే కాదు ఇంకొక 300 అయినా ఈ విగ్రహం ఇలాగే ఉంటుంది. అటు సినీ ఇండస్ట్రీలో ఇటు రాజకీయంగాను ఎన్నో సంచలనాలు సృష్టించిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఆయన భౌతికంగా మనతో లేకపోయినా అని ఆశీస్సులు ఎప్పుడూ మనపై ఉండాలని ఉంటాయని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను’’ అన్నారు.
నందమూరి మోహన రూపా మాట్లాడుతూ ‘‘పూజ్యులు మా తాతగారు నందమూరి తారక రామారావు గారి 101వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి విచ్చేసిన అందరికి కూడా కృతజ్ఞతలు. తెలుగువారి ఖ్యాతిని తెలియజేయడం కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించి ప్రపంచానికి తెలుగువారిని పరిచయం చేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అదేవిధంగా రాజకీయంగా పార్టీ పెట్టి ప్రజలకు ఎంతో సేవ చేశారు. ఆయన వేని పాత్ర అంటూ ఏదీ లేదు గాడ్ ఆఫ్ ఇండియన్ సినిమాగా ప్రతిష్టకు ఎక్కారు. ఒక రాముడు అన్న ఒక కృష్ణుడు అన్న మనకు గుర్తొచ్చే రూపం నందమూరి తారకరామారావు గారు. అలాంటి వ్యక్తి మా తాత గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ పాదాభివందనాలు చేస్తున్నాను’’ అని అన్నారు.