ఏపీలో తానే మంత్రి అయినట్టు, అంతకంటే ఎక్కువగానే ఓ మినిస్టర్ వైఫ్ ఫోజులు కొట్టారు. అంతటితో ఆగలేదు ఆలస్యంగా వచ్చిన పోలీసులపై చిందులు వేస్తూ కన్నెర్ర చేశారు. మీకు ప్రభుత్వం జీతం ఇస్తుందా..?, వైసీపీ ఇస్తుందా అంటూ అక్షింతలు వేశారు. ఇది కాస్తా సోషల్ మీడియా వరకూ చేరడంతో ఈ దాదాగిరి ఏంటంటూ నెటిజన్లే కాదు. రాజకీయ నేతలు, మంత్రిగారి పార్టీ బాస్ మండిపడుతున్నారు. ఇంతకీ ఎవరా భార్యామణి..? పోలీసులపై ఎందుకు చిందులేసినట్టు..?
ఎస్కార్ట్ ఎక్కితే తప్ప కాలు కదపలేనట్టు ఓ మంత్రిగారి భార్య ఇచ్చిన బిల్డప్ వివాదాస్పదమైంది. తనకు ఏ అధికారం లేకపోయినా భర్తకు ఉంటే చాలనుకుందేమో. లేదంటే తానే మినిస్టర్నన్న భ్రమలో విర్రవీ గిందో తెలీదు కానీ ఎస్కార్ట్ ఎక్కడ..? ఎందుకు ఆలస్యమంటూ మంత్రికంటే ఎక్కువే ఫోజులు ఇస్తూ.. కారులో ఠీవిగా కూర్చొని పోలీసులపై కన్నెర్ర చేసింది ఏపీ రవాణశాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి భార్య హరితా రెడ్డి. పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి వెళ్లాల్సిన ఆమె తనకు ఎస్కార్ట్గా రావాలంటూ అధికారులకు హుకూం జారీ చేసింది. పోలీస్ కాన్వాయ్ కావాలంటూ డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా ఆలస్యంగా వచ్చిన ఎస్ఐ రమేష్పై చిందులేసింది. తెల్లారిందా? మీ కోసం మేం ఎదురుచూడాలా? మీకు జీతాలు ప్రభుత్వమే కదా చెల్లిస్తోంది. వైసీపీ వాళ్లు ఏమైనా ఇస్తున్నారా? మీ కోసం అరగంట నుంచి వెయిట్ చేస్తున్నాం. వెంటనే వెళ్లి కాన్వాయ్ స్టార్ట్ చేయండి అంటూ పోలీస్పై అధికారం చెలాయించింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింటకు చేరడంతో ఇది కాస్తా తెగ వైరల్ అవుతోంది. హరితారెడ్డి తీరుపై సోషల్ మీడియా వేదికగా తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు నెటిజన్లు. డ్యూటీలో ఉన్న పోలీస్ అధికారితో ఇలాగేనా మాట్లాడేది అంటూ నిలదీస్తున్నారు. దీనిపై స్పందించిన వైసీపీ అధికార పార్టీ నేతలే కాదు, వారి కుటుంబ సభ్యులు పోలీసులను బానిసల్లా చూస్తున్నారంటూ ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఇకపోతే మనం పాలకులం కాదు. సేవలకులమని టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు పదేపదే పార్టీ శ్రేణులకు చెబు తున్నారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని సూచిస్తున్నారు. ఆర్భాటం, హంగామాకు దూరంగా ఉండాలని ప్రజల్లో పలుచన కాకూడదని, అదే జరిగితే పార్టీ పేరు డ్యామేజ్ అవుతుందని వార్నింగ్ ఇస్తున్నారు. ఇలాంటి సమయంలో మంత్రిగారి భార్య వీడియో బయటకు రావడం నెట్టింట వైరల్ కావడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ అయ్యారు. పోలీసులతో మంత్రి భార్య హరితా రెడ్డి వ్యవహరించిన తీరును తప్పుపట్టారు. మినిస్టర్ రాంప్రసాద్ రెడ్డితో ఫోన్లో మాట్లాడిన చంద్రబాబు ఘటనపై వివరణ కోరారు. అధికారులు, ఉద్యోగుల పట్ల గౌరవంగా మసలుకోవాలని హెచ్చరించారు. ఇలాంటి వైఖరిని సహించేది లేదని, ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా ఎవరు వ్యవహరించినా ఉపేక్షిం చేది లేదని వార్నింగ్ ఇచ్చారు. ఇక ఈ ఘటన పట్ల విచారం వ్యక్తం చేసిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి, ఇలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా చూసుకుంటానని ముఖ్యమంత్రికి తెలిపారు.
మంత్రిగారి భార్య తీరుపైనే కాదు. ఇటు పోలీసుల తీరుపై కూడా మండిపడుతున్నారు జనం. ఎవరు అధికారంలోకి వస్తే వారి మాటలు వినడమే పోలీసుల పనిగా మారిందని, ప్రజల భద్రత, క్రైమ్ కంట్రోల్ సెకండరీగా మారిపోయాయని విమర్శిస్తున్నారు. వీఐవీ భద్రత, వారి కోసం ట్రాఫిక్ కంట్రోల్ మాత్రమే పోలీసుల విధులుగా మారిపోయాయని ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో గంజాయి బ్యాచ్ లు రెచ్చిపోతు న్నాయని, ముఖ్యంగా విశాఖ, విజయవాడల్లో అర్ధరాత్రులు గంజాయి బ్యాచ్ లో వీరంగం సృష్టిస్తున్నా యని ఇలాంటి వాటిపై పోలీసులు దృష్టి సారించాలని సూచిస్తున్నారు. ఇప్పటికైనా రాజకీయ నేతల సేవలో తరించకుండా ప్రజల భద్రతను పట్టించుకోవాలని కోరతున్నారు.