తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఎం.ఎం. కీరవాణితో పాడించాలనే నిర్ణయంతో తనకేం సంబంధం లేదన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. జయజయహే తెలంగాణ గేయ రచయిత అందెశ్రీకే రూపకల్పన బాధ్యతలు ఇచ్చామన్నారు. కీరవాణిని అందెశ్రీయే ఎంపిక చేశారని చెప్పారు. సంగీత దర్శకుడి ఎంపికలో తన పాత్రేమీ లేదన్న ముఖ్యమంత్రి ఎవరితో సంగీతం చేయించుకోవలనేది అందే శ్రీ నిర్ణయానికే వదిలేశామని చెప్పుకొచ్చారు.తెలంగాణ అంటేనే రాచరికానికి వ్యతిరేకం అన్నారు. త్యాగాలు, పోరాటాలు గుర్తొస్తాయని, రాష్ట్ర చిహ్నంలో రాచరికపు పోకడలు ఉండకూడదన్నదే తమ ప్రభుత్వ విధానమని రేవంత్ స్పష్టం చేశారు.
మీడియాతో చిట్ చాట్ సందర్భంగా తమ పాలన అత్యంత పారదర్శకంగా సాగుతోందని తెలిపారు. రాష్ట్రంలో విద్యుత్ సమస్యలు, కరెంట్ కోతలు లేవని, కొన్ని చోట్ల వర్షాల కారణంగా సదుపాయాలలో అవాంతరాలు మాత్రం నెలకొన్నాయని చెప్పుకొచ్చారు. కాళేశ్వరం విషయంలో నిపుణుల సూచనలను పరిగణలోకి తీసుకుంటామన్నారు. మేడిగడ్డపై జ్యుడీషియల్ విచారణ నివేదిక తర్వాత నిర్ణయం తీసుకుంటామన్నారు.ఫోన్ ట్యాపింగ్ కేసును అధికారులు దర్యాప్తు చేస్తున్నారని, తెలిపారు. ఎన్నికల కోడ్ రాష్ట్రంలో ఉన్నందున ఫోన్ టాపింగ్ పై సమీక్ష జరపలేదన్నారు ముఖ్యమంత్రి. బ్యాకప్ డేటాకు సంబం ధించిన హార్డ్ డిస్కులు ఫామ్ హౌస్లో ఉన్నాయో ఎక్కడ ఉన్నాయో విచారణ అధికారులు తేల్చాల్సి ఉందన్నారు.