లోక్ సభ ఎన్నికలు కీలక ఘట్టానికి చేరుకున్న వేళ ఎన్డీఏ, ఇండియూ కూటమి నేతల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. ప్రధాని నరేంద్ర మోదీ అజంగఢ్, జూన్ పూర్ లలో సుడిగాలి పర్యటన చేస్తూ, బహిరంగ సభల్లో ప్రసంగిస్తుంటే, ఈ మధ్యే జైలు నుంచి విడుదలైన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇండియా కూటమి తరుపున లక్నోలో ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ తో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. ప్రధాని ఆరోపణలకు కేజ్రీవాల్ కౌంటర్ ఇవ్వడంతో ప్రచారం వేడెక్కింది.
లోక్ సభ ఎన్నికలు నాల్గో దశ పూర్తయింది. ఇంతవరకూ 377 నియోజకవర్గాల్లో పోలింగ్ పూర్తయింది. మరో 169 స్థానాలకు ఎన్నికలు జరగాల్సిన స్థితిలో మిగతా అన్నినియోజక వర్గాల్లో విజయం కోసం ఎన్డీఏ, ఇండియా కూటమి ప్రచారం డోసు పెంచాయి. రెండు పక్షాల స్టార్ కాంపైనర్లు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఆరు దశాబ్దాలుగా దేశంలో మతపరమైన ఉద్రిక్తతలను కాంగ్రెస్ రెచ్చగొడుతోందని ప్రధాని మోదీ విమర్శించారు. కాంగ్రెస్ నిజస్వరూపాన్ని తానే బయటపెట్టానని ఆయన పేర్కొన్నారు. ప్రతిపక్షాలు ఎంత బలం కూడగట్టినా పౌరసత్వ సరవణ చట్టాన్ని రద్దు చేయబోమని ప్రధాని స్పష్టంచేశారు. అజంగఢ్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోదీ బహిరంగ సభలో కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ మత పరమైన ఉద్రిక్తతలను రెచ్చగొడుతోందని ఆరోపించారు. మోదీ గ్యారంటీపై ప్రజలకు నమ్మకం ఉందని ప్రధాని పేర్కొన్నారు. పౌరసత్వ సవరణ చట్టమే మోదీ గ్యారంటీకి తాజా ఉదాహరణ అని అన్నారు. సీఏఏ కింద నిన్ననే పలువురు వలసవచ్చిన వారికి భారతీయ పౌరసత్వం ఇచ్చినట్లు తెలిపారు. ప్రజలంతా బీజేపీ, ఎన్డీఏ కూటమితోనే ఉన్నారని స్పష్టం చేశారు. మోదీ వెళ్తే సీఏఏ రద్దయి పోతుందని కొందరు దుష్ర్పచారం చేస్తున్నారని మండిపడ్డారు. సీఏఏను ఎవరూ తొలగించలేరని మోదీ స్పష్టం చేశారు.
బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తుందని ఢిల్లీ అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఎస్సీ, ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్లు తొలగిస్తారని చెప్పారు. లక్నోలో సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ తో కలిసి కేజ్రీవాల్ ఇండియా కూటమి తరుపున ప్రచారంలో పాల్గొన్నారు. ఎన్డీఏ కూటమి ఎస్సీఎస్టీ, బీసీల రిజర్వేషన్లు రద్దు చేస్తారని ఆయన హెచ్చరించారు. మోదీ అమిత్ షాను ప్రధాని చేసేందుకు ఈ ఎన్నికల్లో ఎక్కువ కష్టపడుతున్నారని ఆయన ఆరోపించారు. బీజేపీ గెలిస్తే, యూపీ ముఖ్యమంత్రి పదవి నుంచి యోగి ఆదిత్యనాథ్ ను తొలగిస్తారన్నారు. జూన్ 4వ తేదీన భారత కూటమి అధికారంలోకి వస్తోందని కేజ్రీవాల్ ఆశాభావం వ్యక్తం చేశారు. బీజేపీ మరోసారి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం లేదని కేజ్రీవాల్ చెప్పారు. ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ మాట్లాడుతూ ఇండియా కూటమి విజయం ఖాయం అన్నారు.ఈసారి బిజెపికి 220 లోపే ఎంపీ సీట్లు వస్తాయన్నారు. దేశంలో ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు.