లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ ప్రక్రియ ముగియడంతో ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి.ఎంత మెజార్టీతో విజయం సాధిస్తారన్న టాక్ రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతుంటే, మరోపక్క గెలుపు అంచనాల్లో ఉన్న పార్టీ నేతలు ఎవరికి వారే తమకు అనుకూలంగా లెక్కలు వేసుకుం టున్నారు. మరి ప్రజలు ఎవరివైపు నిలిచారు..?ఎవరి ఆశలు ఫలిస్తాయి..?
తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరగగా ఆదిలాబాద్ సెగ్మెంట్లో బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్లు హోరాహోరీగా తలపడ్డాయి. ఇక ఈ నెల 17న పోలింగ్ ప్రక్రియ ముగియడంతో మొన్నటి వరకూ ఓటింగ్పై ఫోకస్ పెట్టిన పార్టీ నేతలు ఇప్పుడు గెలుపోటముల లెక్కల్లో బిజీ అయ్యారు. ఎక్కడ ఎంత పోలింగ్ శాతం నమోదు అయింది. అనుకూల ఓట్లా, వ్యతిరేక ఓటింగా అన్నది బేరీజు వేసుకుం టున్నారు. ఇక ఆదిలాబాద్లో గతసారి కంటే ఈసారి దాదాపు రెండున్నర శాతం పోలింగ్ పెరిగింది. 2019 ఎన్నికల్లో 71.42%శాతం నమోదుకాగా, ఈసారి 74.03% పోలింగ్ నమోదయింది. దీంతో పెరిగిన ఓటింగ్ తమకు అనుకూలమా, ప్రతికూలమా అన్నదానిపై కాంగ్రెస్ నుంచి సీఎం రేవంత్రెడ్డి, సీతక్క, బీఆర్ఎస్ నుంచి కేసీఆర్, కేటీఆర్ బీజేపీ నుంచి కిషన్రెడ్డి, బండి సంజయ్లు ఆరా తీస్తున్నారు.
మోదీ చరిష్మా, హిందుత్వ నినాదమే ప్రధాన అంశాలు ప్రచారం చేసిన కమలనాథులు అవే తమను గెలిపిస్తాయన్న ధీమాలో ఉన్నారు. నిర్మల్, ముదోల్ నియోజకవర్గాల్లో బీజేపి సంపూర్ణ ఆధిపత్యం సాధిస్తుందని,అలాగే బీజేపి ఎమ్మెల్యేలు ఉన్న మరో ఆదిలాబాద్, సిర్పూర్లలో సైతం మెజారిటీ ఖాయ మని భావిస్తున్నారు పార్టీ శ్రేణులు. కొన్ని సామాజికవర్గాలను మినహాయిస్తే మిగిలిన అన్ని వర్గాలతోపాటు యువతలో వచ్చిన మార్పే తమను గెలిపించి తీరుతుందన్న గట్టి నమ్మకంతో ఉన్నారు. ఇక మరోపార్టీ అయిన కాంగ్రెస్ తామే అధికారంలో ఉండటం కలిసి వస్తుందని, రాహుల్గాంధీ, రేవంత్రెడ్డి ప్రచారంతో ఓటర్లు భారీగా తమకే ఓటు వేసి ఉంటారన్న ధీమాలో ఉన్నారు. ఆసిఫాబాద్ నియోజకవర్గంలో భారీగా ఆ తర్వాత సిర్పూర్ ఖానాపూర్లలో కొంత ఆధిక్యత వస్తుందని ఆశ పడుతు న్నారు. శాసనసభ ఎన్నికల్లో నిర్మల్, ముధోల్ నియోజకవర్గం మూడో స్థానానికి పరిమితం కాగా ఇప్పుడు అదే సెగ్మెంట్ మొదటి స్థానంలో లేదా రెండవ స్థానంలో ఉంటుందని భావిస్తున్నారు.
ఇక బీజేపీ, కాంగ్రెస్ల మాదిరిగానే బీఆర్ఎస్ కూడా తమకు మంచి ఫలితాలే వస్తాయన్న అంచనాల్లో ఉంది. రాష్ట్రంలో మారిన రాజకీయ పరిణామాల కారణంగా, కొందరు కీలక నేతలు పార్టీని వీడినప్పటికీ క్షేత్రస్థాయిలో పని చేసే క్యాడర్ అనుకూలంగానే ఉందనే ధీమా బీఆర్ఎస్ కు ఉంది. కానీ అనుకున్నన్ని ఓట్లు రాకపోవచ్చన్నది కూడా అంచనావేస్తున్నారు. అధికారం కోల్పోవడం, నేతలు వలస బాట పట్టడం తమకు మైనస్ అయినప్పటికీ, గ్రామీణ ప్రాంతాల్లో రైతులు, మహిళలు, పెన్షన్ తీసుకునే వారంతా బీఆర్ఎస్కు అనుకూలంగానే ఉన్నారన్న నమ్మకం పార్టీలో కనిపిస్తోంది. ఆసిఫాబాద్, బోత్, సిర్పూర్, ఖానాపూర్, ఆదిలాబాద్ నియోజకవర్గాల్లో తమదే విజయని భావిస్తున్నారు. ఇలా మూడు పార్టీలు కూడా జనం తమకే ఓటు వేసి ఉంటారని, అత్యధిక సీట్లు సాధించడం ఖాయమని భావిస్తు న్నారు. మరి ఎవరి ఆశలు ఫలిస్తాయి..? ఎవరిది పై చేయి అన్నది తెలియాలంటే మాత్రం జూన్ 4 న ఫలితాలు వచ్చే వరకూ వేచి చూడాల్సిందే.