సీఎం రేవంత్రెడ్డిపై ఫైరయ్యారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ముఖ్యమంత్రి తీసుకొస్తున్న విధానాలతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ప్రతినిధులతో సమావేశమయ్యారు కేటీఆర్. తెలంగాణలో కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయడం ఎవరి తరం కాదన్నారు… బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అనేక మంది విద్యార్థులను గులాబీ పార్టీ నాయకులుగా చేసిందన్నారు. పోరాటాలు తమకు కొత్త కాదన్న కేటీఆర్.. ఎందరో ముఖ్యమంత్రులతో పోరాడిన విషయాన్ని గుర్తు చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి ఏమీ తెలియదన్న ఆయన.. చిట్టి నాయుడుతో కొట్లాడాలంటే మనసు ఒప్పుకోవడం లేదన్నారు.
దేశంలో జోనల్ వ్యవస్థ ద్వారా 95 శాతం స్థానికులకు ఉద్యోగాలు దక్కేలా కేసీఆర్ చేశారన్నారు…కేటీఆర్. నీళ్లు, నిధులు, నియామకాలు అనే ట్యాగ్ లైన్తో పనిచేసినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో ఏ సమస్య వచ్చినా ప్రజలు తెలంగాణ భవన్కు వస్తున్నారంటూ చెప్పుకొచ్చారు. కేసీఆర్ ఇచ్చిన జీవో నెంబర్ 55ను రద్దు చేసి జీవో నెంబర్ 29 తెచ్చారని.. దీని ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అన్యాయం జరుగుతోందన్నారు కేటీఆర్.
కేసులు పెట్టడమే ప్రభుత్వానికి తెలిసిన విద్య అన్నారు మాజీ మంత్రి కేటీఆర్. తెలంగాణను నాశనం చేస్తుంటే బీజేపీ ఏం మాట్లాడకుండా ఉంటోందని ఆరోపించారు. ములుగు నుంచి మొదలు పెడితే.. ఆదిలాబాద్ వరకు కాంగ్రెస్ నేతల వసూళ్లు సాగుతున్నాయని ఆరోపించారు కేటీఆర్. త్వరలోనే అన్ని జిల్లాల్లో బీఆర్ఎస్వీ మీటింగ్లు పెట్టుకుందామన్నారు. ఢిల్లీకి కప్పం కట్టేందుకే పదే పదే సీఎం రేవంత్ రెడ్డి హస్తినకు వెళుతున్నారంటూ ఆరోపించారు కేటీఆర్.


