తెలంగాణ పోలీస్ శాఖలో విషాదం నెలకొంది. సీనియర్ ఐపీఎస్ అధికారి రాజీవ్ రతన్ గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన ప్రస్తుతం తెలంగాణ విజిలెన్స్ డీజీగా ఉన్నారు. గుండెపోటు రావడంతో రాజీవ్ రతన్ను ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. అయితే, చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
1991 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన రాజీవ్ రతన్… ప్రస్తుతం విజిలెన్స్ డీజీ గా ఉన్నారు. గత ఏడాది మహేందర్ రెడ్డి డీజీపీగా పదవి విరమణ చేసిన సమయంలో డీజీపీ రేసులో రాజీవ్ రతన్ పేరు ప్రముఖంగా వినిపించింది. ఆ తర్వాత ఆయన విజిలెన్స్ డీజీగా పదోన్నతి పొందారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి ఆరోపణలపై విజిలెన్స్ డీజీ హోదాలో రాజీవ్ రతన్ విచారణ చేశారు. ఆయన సమర్పించిన నివేదిక ఆధారంగా ప్రభుత్వం జ్యుడీషియల్ కమిషన్ను ఏర్పాటు చేసింది. రాజీవ్ రతన్ మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు సంతాపం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు.


