భారత రాష్ట్ర సమితి పార్టీ సుప్రీం కోర్టుకు వెళ్లింది. ఎందుకంటే.. కారు గుర్తు పై గెలిచి పార్టీ మారి.. కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేల పై అనర్హత వేటు వేయాలని కోరుతూ భారాస సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పార్టీ మార్చిన పది మంది ఎమ్మెల్యేల పై అనర్హత వేటు వేయాలని ఫిర్యాదు చేసి తొమ్మిది నెలలు అవుతున్నప్పటికీ.. స్పీకర్ నిర్ణయం తీసుకోలేదని పిటిషన్ లో తెలియచేశారు. కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, దానం నాగేందర్కు వ్యతిరేకంగా ఎస్ఎల్పీ దాఖలు చేసింది. మిగిలిన ఏడుగురు ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా రిట్ పిటిషన్ దాఖలు చేసింది.
హైకోర్టు తీర్పు ఇచ్చి ఆరు నెలలు అవుతున్నా… ఇప్పటి వరకు స్పీకర్ చర్య తీసుకోలేదని.. కనీసం నోటీసు కూడా ఇవ్వలేదని న్యాయస్థానం దృష్టికి తెచ్చింది. గతంలో కేశం మేఘాచంద్ర కేసులో ఇచ్చిన తీర్పు అమలు చేయాలని భారాస కోరింది. పార్టీల ఫిర్యాదుల పై స్పీకర్ మూడు నెలల్లో నిర్ణయం చెప్పాలని కేశం మేఘా చంద్ర కేసులో ఇచ్చిన తీర్పును భారాస ప్రస్తావించింది. నాలుగు వారాల్లో స్పీకర్ నిర్ణయం తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది.