ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. సమావేశంలో పాల్గొన్న నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (నీటి పారుదల శాఖ) ఆదిత్యనాథ్ దాస్ పాల్గొన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో తెలంగాణపై పడే ప్రభావంపై ఐఐటీ హైదరాబాద్ టీం తో నివేదిక తయారు చేయించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. నెల రోజుల్లో సమగ్ర నివేదిక తయారు చేయాలని ఆదేశించారు. ఐఐటీ హైదరాబాద్ టీంతో కో ఆర్డినేషన్ కోసం ప్రత్యేక అధికారిని నియమించాలని సూచించారు. పోలవరం నిర్మాణంతో భద్రాచలం దేవాలయానికి ఏర్పడే ముప్పుపై సమగ్ర అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.
2022 లో 27 లక్షల క్యూసెక్ ల వరద నీరు వచ్చినప్పుడు భద్రాచలం ముంపునకు గురైనట్లు సీఎంకి వివరించారు అధికారులు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా చేపట్టిన గోదావరి బనకచర్ల ప్రాజెక్టు అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ ప్రాజెక్ట్ పైన ఇటీవల ఏపీ ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిందని వివరించారు. వరద జలాల ఆధారంగా నిర్మిస్తున్న ఆ ప్రాజెక్టుకు ఎలాంటి అనుమతులు లేవని సీఎంకు తెలియజేశారు
ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కి తెలంగాణ అభ్యంతరాలను తెలపాలని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం అవసరమైతే గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుతో పాటు కేంద్ర జల్ శక్తి మంత్రిత్వ శాఖకు లేఖలు రాయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.