తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిన్న కురిసిన భారీ వర్షానికి భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గ పరిధిలోని పెద్దవాగు ప్రాజెక్టుకు గండిపడింది. ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయడంతో దిగువ భాగంలో ఒక్కసారిగా నీటి ప్రవాహం పెరిగిపోయింది. పెద్దవాగుకు గండి పడటంతో దిగువున ఉన్న గ్రామాల్లో వరద ప్రవాహం పెరిగిపోయింది. భద్రాద్రి జిల్లా కొత్తగూడెంలోని నారాయణపురం వద్ద పెద్ద సంఖ్యలో వరద ప్రవాహంలో చిక్కుకోవడంతో వారిని హెలికాఫ్టర్లలో రక్షించారు. పోలవరం, అశ్వారావుపేట ఎమ్మెల్యేలు సహాయ చర్యల్ని పర్యవేక్షించారు. వరదలు ముంచెత్తిన సమాచారం తెలియడంతో మంత్రి తుమ్మల సీఎంఓకు సమాచారం అందించారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, రెస్క్యూ టీమ్లతో కలిసి సహాయ చర్యలు చేపట్టాయి. నిన్న తెలంగాణలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో 11.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మంచిర్యాల, నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లోనూ ఓ మోస్తరు వర్షాలు కురిశాయి.
నేడు మరో నాలుగు జిల్లాల్లో, రేపు ఆరు జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. తెలంగాణలోని కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, హనుమకొండ జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. రేపు ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో అత్యంత భారీగా, నిజామాబాద్, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.
ఇక ఏపీలో సైతం వానలు దంచి కొడుతున్నాయి. గత మూడు నాలుగు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత కొద్ది రోజులుగా వాన జాడ లేక ఆందోళన చెందిన రైతాంగం వర్షాలతో ఉక్కిరి బిక్కిరి అవుతోంది. ఐఎండీ సూచనల ప్రకారం పశ్చిమమధ్య, దానిని ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడిందని విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. ఇది రానున్న రెండుమూడు రోజుల్లో మరింత బలపడి వాయువ్య దిశగా ఒడిశా తీరం వైపు కదిలే అవకాశం ఉందన్నారు.
అల్ప పీడన ప్రభావంతో నేడు ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు, శ్రీకాకుళం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అలాగే విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు.
నిన్న భారీ వర్షాల కారణంగా ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం కొండవాగు ఉధృతిలో ఒక కారు కొట్టుకుపోయింది. రాజమహేంద్రవరం నుంచి వేలేరుపాడు మండలం రుద్రంకోటకు వెళ్తుండగా కొండ వాగు ప్రవాహంలో కారు కొట్టుకుపోయింది. ఇందులో ముగ్గురు పెద్దలు, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కారు నీటి ప్రవాహంలో కొందదూరం వెళ్లిపొదల్లో చిక్కుకుంది. గమనించిన గ్రామస్థులు హుటాహుటిన భారీ మోకులు, తాళ్లతో నీళ్లలో ఈదుకుంటూ వెళ్లి వారిని కాపాడారు.
రాష్ట్రంలో వర్షాలు తీవ్రంగా నమోదు కావడంతో అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు అలర్ట్ చేశారు. నిన్న రాత్రి సీఎంవో అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఏలూరు జిల్లా కలెక్టర్, ఎస్పీలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. పెద్దవాగుకు రెండు చోట్ల గండిపడడంపై పలు సూచనలు చేశారు. ప్రాణ నష్టం, పశు నష్టం జరగకుండా చూడాలని అధికారులకు సీఎం ముందస్తు ఆదేశాలు జారీ చేశారు.