హైదరాబాద్లో కూల్చివేతలపై అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మండిపడ్డారు. పేద ప్రజల జీవనాధారాన్ని అధికారులు ధ్వంసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి పబ్లిక్ నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు చేపడుతున్నారని ఆరోపించారు. అధికారులు చేసే పనుల వల్ల ప్రజల మధ్య తాము తిరగలేకపోతున్నామని అన్నారు. ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో కల్యాణ లక్ష్మీ , షాదీ ముబారక్ , సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు.
అనంతరం మాట్లాడుతూ.. పేదల ఇళ్లను అధికారులు తొలిగించడం సరైంది కాదని దానం అన్నారు. ఓల్డ్ సిటీ లో అక్రమ నిర్మాణాలు వారికి కనిపించడం లేదా? అంటూ ప్రశ్నించారు. మొదలు పెడితే అక్కడి నుండే తొలగింపులు చేపట్టాలని.. అధికారుల వైఖరి వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని చెప్పారు. హైదరాబాద్లో పుట్టి పెరిగిన వాడిని… హైదరాబాద్ ప్రజలకు అన్యాయం జరిగితే చూస్తూ ఉండలేనని అన్నారు. అధికారులు తామే సుప్రీం అనుకుంటున్నారు… అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇస్తే ఆ ప్రభుత్వాలకు మనుగడ ఉండదని చెప్పారు.
ప్రభుత్వ ఆధీనంలో అధికారులు పని చేయాలని సూచించారు. హైడ్రా చెరువులను కాపాడటానికి పని చేస్తుంది.. దానిని స్వాగతిస్తున్నాను. మూసీ ప్రక్షాళన చేయాలనేది ముఖ్యమంత్రి ఆకాంక్ష. కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ సుందరీకరణ చేసి , పర్యాటక కేంద్రంగా మారుస్తుంది… అని దానం అన్నారు.