ఏపీలో ఏ స్థాయిలో ఎన్నికల పోరాటం జరిగిందో ఘర్షణలే నిరూపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో పలు నియోజక వర్గాల రిటర్నింగ్ ఆఫీసర్లు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. రెండు వైపుల నుంచి అభ్యర్థులు ఇబ్బంది పెడుతుం డటంతో తమకు ఈ బాధ్యతల వద్దని ఎన్నికల సంఘానికి నివేదించు కుంటున్నారు. రాయలసీమలోని దాదాపుగా పదిహేను నియోజకవర్గాల రిటర్నింగ్ ఆఫీసర్లు సెలవుల కోసం ఈసీకి దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈసీ మాత్రం తాము అండగా ఉంటామని నిర్భయంగా విధులు నిర్వహించాలని ఈసీ సూచిస్తోంది. అయినా కొంత మంది తట్టుకోలేక సెలవు పెట్టి వెళ్లిపోతున్నారు.
తాడిపత్రి ఘటనల నేపథ్యంలో సిట్ అధికారుల తిష్టతో తీవ్ర ఒత్తిడికి గురివుతున్న రిటర్నింగ్ అధికారి రాంభూపాల్ రెడ్డి సెలవుపై వెళ్లిపోయినట్లుగా తెలుస్తోంది. తాడిపత్రి ఘటనలపై ఇంకా సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ విషయంలో ఆయనపై తీవ్ర ఒత్తిడి ఉండటంతో తనను ఎన్నికల డ్యూటీ నుంచి తప్పించాలని రాంభూపాల్ రెడ్డి ఇదివరకే ఉన్నతాధికారులను కోరారు. కౌంటింగ్ వరకు కొనసాగాలని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. అయితే, తనకు ఆరోగ్యం బాగాలేదంటూ మరోసారి సెలవు కోసం విజ్ఞప్తి చేయడంతో అధికారులు అనుమతించక తప్పలేదు. రాంభూపాల్ రెడ్డి స్థానంలో ఇతర అధికారికి బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు సమాచారం. తాడిపత్రిలో ఎలాంటి ఫలితం వచ్చినా రావణకాష్టం జరుగుతుందన్న ఆందోళన కనిపిస్తోంది. పోస్టల్ బ్యాలెట్స్ దగ్గర నుంచి కౌంటింగ్ వరకూ ప్రతీ విషయం వివాదాస్పదమయ్యే అవకాశం ఉంది. అభ్యర్థలు ఇద్దరూ ఎవరికి వారు తగ్గని నేతలుగా పేరు తెచ్చుకున్నారు. ఫ్యాక్షన్ ప్రభావమూ ఎక్కువగా ఉంది. పోలింగ్ రోజు పోలీసులు కంట్రోల్ చేసినా ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. కౌంటింగ్ రోజు పరిస్థితులు ఎలా ఉంటాయో అంచనా వేయడం కష్టంగా మారింది.
ఎవరు గెలిచినా, ఎవరు ఓడిపోయినా రాష్ట్రంలో ప్రభత్వం మారినా మారకపోయినా, గొడవలు జరగడం ఖాయంగా కనిపిస్తోంది. తాడిపత్రిని అత్యంత సమస్యాత్మక ప్రాంతంగా గుర్తించిన ఈసీ కేంద్ర బలగాలను పంపింది. గొడవలు జరిగే అవకాశం ఉన్న ప్రతి చోటా బలగాలను మోహరించింది. ఫలితాలు వచ్చిన రెండు వారాల వరకూ భద్రత ఉంటుందని చెబుతున్నారు. అయితే ఈ బాధ్యత అంతా రిటర్నింగ్ అధికారులే చూసుకోవాల్సి ఉంటుంది. కఠినంగా వ్యవహరిస్తే తర్వాత అధికారంలోకి వచ్చే వారు వేధిస్తా రన్న అనుమానాలు కూడా ఉన్నాయి. దీంతో ఆర్వోలు ఎందుకైనా మంచిదని సెలవులు కోరుతున్నట్లుగా తెలుస్తోంది.