వారం, పది రోజుల్లో లోక్సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించాల్సి ఉండగా.. ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ అనూహ్యంగా రాజీనామా చేయడం సంచలనం సృష్టించింది. మరో కమిషనర్ అనూప్ పాండే.. గతనెల పదవీ విరమణ చేయడంతో సీఈసీ రాజీవ్ కుమార్ ఒక్కరే మిగిలారు. అత్యవసరంగా కొత్త కమిషనర్లను నియమించాల్సిన పరిస్థితి తలెత్తడం పట్ల ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా లో కీలక పరిణామాలపై కథనం.
ఏప్రిల్ నెలలో దేశవ్యాప్తంగా ఎన్నికలకు అన్నిరాజకీయ పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. మార్చి 14 – 16 తేదీల మధ్య ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తారని భావిస్తున్న తరుణంలో ఎలక్షన్ కమిషనర్ అరుణ్ గోయల్ తన పదవికి రాజీనామా చేశారు. ఎన్నికల కమిషనర్ గా అరుణ్ గోయల్ పదవీకాలం 2027 డిసెంబర్ 5వ తేదీ వరకూ ఉంది. 2025 ఫిబ్రవరిలో రాజీవ్ కుమార్ రిటైర్మెంట్ తర్వాత ఆయనే చీఫ్ ఎన్నికల కమిషనర్ అయిఉండేవారు. అటువంటిది ముందే రాజీనామా చేయడం ఆశ్చర్య కల్గించింది. ఈ పరిణామాలకు నేపథ్యం ఏమిటి?
ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది ఒక రాజ్యాంగబద్దమైన స్వతంత్ర సంస్థ. అది దేశంలో ఎన్నికలను నిష్పక్షి పాతంగా నిర్వహించాల్సి ఉంటుంది. ఈసీఐని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ తో పాటు ఇద్దరు కమిషనర్లు నడిపిస్తారు. సీఈసీతో పాటు ఇద్దరు ఎలక్షన్ కమిషనర్లను నియమించే అధికారం కేవలం ఒక కమిటీకి ఉంటుంది. ఇందులో ప్రధాన మంత్రి, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉంటారు. ఈ కమిటీ ఏకాభిప్రా యంతో సీఈసీతో పాటు కమిషనర్లను నియమి స్తారు. అయితే గతేడాది ఎలక్షన్ కమిషనర్ల నియామకానికి సంబంధించిన కమిటీలో నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తప్పించి.. ఆ స్థానంలో కేంద్ర మంత్రిని రిప్లేస్ చేయడానికి ఒక బిల్ను ప్రవేశ పెట్టారు. ఆ బిల్లు అనేక వివాదాల నడుమ ఆమోదం పొందింది. దీంతో కొత్త చట్టం ప్రకారం ప్రధాని, కేంద్ర మంత్రి, ప్రతిపక్ష నాయకుడు ఉండే కమిటీ సీఈసీతో పాటు కమిషనర్లను నియమిస్తారు. అంటే అధికార పార్టీ తమ ఇష్టానుసారం సీఈసీ, కమిషనర్లను నియమించుకునే అధికారం ఉంది.
ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ప్రధాన ఎన్నికల కమిషనర్గా రాజీవ్ కుమార్ ఉన్నారు. దీనికి మరో ఇద్దరు ఎలక్షన్ కమిషనర్లు ఉండాలి. ఎలక్షన్ కమిషనర్ అనూప్ పాండే గత నెల పదవీ విరమణ చేశారు. తాజాగా మరో కమిషనర్ అరుణ్ గోయల్ రాజీనామా చేశారు. దీంతో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు కేవలం సీఈవో రాజీవ్ కుమార్ మాత్రమే మిగిలారు. కొత్తగా ఇద్దరు కమిషనర్లను నియమించుకోవడానికి ఇప్పుడు ఎన్డీయే ప్రభుత్వానికి అవకాశం ఏర్పడింది. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ లోపే తమకు అనుకూలమైన కమిషనర్లను మోడీ ప్రభుత్వం నియమించుకోవచ్చు. ప్రతిపక్ష నాయకుడు అంగీకరించకపోయినా.. ప్రధాని, కేంద్ర మంత్రి ఓట్లతో కమిషనర్ల నియామకం జరిగిపోవచ్చు. ఒక వేళ ఇద్దరు కమిషనర్లను నియమించకపోతే.. రాబోయే లోక్సభ ఎన్నికల భారం మొత్తం సీఈసీ రాజీవ్ కుమార్ మీద మాత్రమే ఉన్నది.
ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ముగ్గురి సారథ్యంలో నడవాలి. సీఈసీ ఉన్నా. ముగ్గురు కమిషనర్లకు దాదాపు ఒకే రకమైన అధికారాలు ఉంటాయి. ఇప్పుడు లోక్సభ ఎన్నికల నిర్వహించాల్సిన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా.. ఒక్కరి చేతిలోకి వెళ్లిపోయింది. మిగిలిన ఇద్దరు కమిషనర్లను వెంటనే నియ మించే అవకాశం లేదు. ఒక వేళ ఉన్నా.. ఆ రెండు పొజిషన్లలోకి ఎవరు వస్తారో ఊహించుకోవచ్చు. మొత్తానికి ఈ రాజీనామా వల్ల ఎవరికి ప్రయోజనం? ఈ పరిణామాలకు దారితీసిన కారణాలు ఏంటి.. తెలియాల్సి ఉంది. ఈలోపే ఎన్నికలు కూడా అయిపోవచ్చు.