మొన్నటి వరకు తీవ్రమైన వేడితో, ఉక్కపోతతో అల్లాడిన దేశ రాజధాని డిల్లీ.. ఇప్పుడు వర్షం ధాటికి వణికిపోతోంది. రికార్డు స్థాయి వర్షపాతం కురవడంతో హస్తినలోని రోడ్లపై మోకాళ్లలోతు నీళ్లు చేరాయి. 24 గంటల్లోనే 22.81 శాతం వర్షపాతం నమోదవడంతో రాజధాని ప్రజలు అల్లాడిపోయారు. గత 88 ఏళ్లలో ఇదే అత్యధిక వర్షపాతంగా చెబుతు న్నారు అధికారులు.
భారీ వర్షానికి ఇళ్లలోకి నీరు చేరింది. రోడ్లపైనా వరద పోటెత్తింది. దీంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. జనజీవనం అస్తవ్యస్థమైంది. ఒక్కమాటలో చెప్పాలంటే నిత్యం ఉరుకులు పరుగులతో కన్పించే ఢిల్లీ వీధులు ఇప్పుడు వరదనీటితో నిండిపోయి కన్పిస్తున్నాయి. సఫ్థర్జంగ్, అశోకారోడ్, ఫిరోజ్ షా రోడ్, కన్నాట్ప్లేస్లో రోడ్లు నీట మునిగిపోగా అండర్పాస్లను మూసేశారు. నగరం లోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ -1కి చెందిన పైకప్పులో కొంత భాగం కుప్ప కూలింది. దీంతో ఒకరు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. ఓవైపు పార్లమెంటు సమావేశాలు జరగుతుండడంతో వాటికి హాజరయ్యేందుకు వచ్చిన ఎంపీలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. లోథి ఎస్టేట్స్ లో ఉన్న ఎస్పీ ఎంపీ రాంగోపాల్ యాదవ్ను ఆయన సిబ్బంది ఎత్తుకొని తీసుకొచ్చి మరీ కారులో కూర్చో బెట్టాల్సిన పరిస్థితి తలెత్తింది.