పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో సీడబ్ల్యూసీ నిర్ణయంపై మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ హర్షం వ్యక్తం చేశారు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలోని రాజీవ్ గాంధీ కళాశాలలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
పోలవరం డయాఫ్రంవాల్ కొట్టుకుపోవడానికి నూరుశాతం చంద్రబాబే కారణమని హర్షకుమార్ ఆరోపించారు. డయాఫ్రంవాల్ హార్డ్రాక్ వద్ద చేపట్టాలని, ఇసుక నెలలో చేయకూడదని తెలిసినా పాటించలేదని ఆరోపించారు. పోలవరం విషయంలో తాను మొదటి నుంచీ పోరాటం చేస్తున్నానని తెలిపారు. విలోమ ఫిల్టర్ ద్వారా సీపేజ్ను అరికట్టడం అసంభవం అన్నారు హర్షకుమార్. ప్రధాన డ్యామ్ రివర్ డిఫెక్ట్ లెవల్ 8.32 నుండి తప్పకుండా చేయాలన్నారు. లేదంటే మరో కాలేశ్వరం అవుతుందని హర్షకుమార్ ఆందోళన వ్యక్తం చేశారు.
కొన్ని పనులు చేయాలంటే ఎక్కువ సమయం పడుతుందని, భూగర్భ పనులు చేయకుండా కప్పెట్టేస్తారా? అని హర్షకుమార్ ప్రశ్నించారు. పోలవరాన్ని ప్రభుత్వం త్వరగా పూర్తిచేసి, రాష్ట్ర ప్రజల కోరిక తీర్చాలని హర్షకుమార్ కోరారు. ప్రాజెక్టు నిర్మాణంలో జాగ్రత్తలు పాటించాలని, సమయం వృథా చేయకూడదన్నారు.