కుప్పం..ఈ పేరు చెప్పగానే మొదటగా గుర్తుకొచ్చేది మాజీ సీఎం, ఏపీ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడే. చిత్తూరు జిల్లా నారావారిపల్లెకు చెందిన చంద్రబాబు నాయుడు మొదట్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. 1978లో చంద్రగిరి నుంచి పోటీ చేసిన ఆయన.. విజయం సాధించారు. అనంతరం 1983లో జరిగిన ఎన్నికల్లో మరో సారి బరిలో దిగి టీడీపీ అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. అనంతరం.. టీడీపీలో చేరి కుప్పం నియోజకవ ర్గానికి మారిన చంద్రబాబు.. ఇక అప్పట్నుంచి వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో టీడీపీ అధినేతగా మారిన చంద్రబాబు.. నియోజకవర్గంపై పూర్తిస్తాయిలో పట్టు సాధించారు. చివరకు నామినేషన్ సమ యంలో వచ్చి వెళ్లిపోయినా తాను తిరుగులేని విధంగా నాటి నుంచి నేటి వరకు గెలుస్తూ వస్తు న్నారు.
అభివృద్ధి విషయానికి వస్తే గతంలో సీఎం హోదాలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు చంద్రబాబు. కుప్పం పరిధిలో ఉన్న కుప్పం, రామకుప్పం, గుడుపల్లి, శాంతిపుర నాలుగు మండలాల్లో గ్రామ గ్రామాన విశాలమైన రోడ్లు కుప్పంకు ప్రత్యేక ఆకర్షణ. అధునాతన ప్రభుత్వ భవనాలు ఇక్కడ కన్పిస్తాయి. ఇజ్రాయిల్ సేద్యం, మైక్రో, డ్రిప్ ఇరిగేషన్ వ్యవసాయ విధానాలను చంద్రబాబు ఇక్కడి ప్రజలకు పరిచయం చేశారు. ఇంజనీరింగ్ కళాశాలతో పాటు మెడికల్ కళాశాల ఇక్కడ ఉంది.మరి.. కుప్పం నియోజకవర్గంలో అంతా బాగానే ఉందా ? ప్రజలు ఇప్పటికీ చంద్రబాబును గతంలో మాదిరిగా ఆదరించే పరిస్థితి ఉందా? గత ఎన్నికల నుంచి వైసీపీ చేపట్టిన ఆపరేషన్తో నియోజకవర్గంలో పరిస్థితులు ఏమైనా మారాయా ? ప్రజలు ఏమనుకుంటున్నారు ?
టీడీపీ అధినేత చంద్రబాబు ఏడుసార్ల నుంచి వరుసగా కుప్పంలో గెలుస్తున్నారు సరే. అలాగని అంతా బాగుందా అంటే లేదన్న కామెంట్లు బలంగా విన్పిస్తున్నాయి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయం కావచ్చు.. లేదంటే ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కావచ్చు..ఎప్పుడైనా సరే ఓ పార్టీ అధినేత గా ఎంతో బిజీగా ఉంటుంటారు. ఈ క్రమంలోనే ఆయన.. నియోజకవర్గానికి తరచుగా వచ్చే పరిస్థితి ఏ మాత్రం ఉండదు. ఇదే ఇక్కడి ప్రజల్లో ప్రధాన అసంతృప్తి. అయితే.. తాను రాకపోయినా.. ఎక్కడా కూడా అభివృద్ధి పనులు ఆగకుండా చూసేందుకు ఓ ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు చంద్రబాబు. దీంతో.. వారే ఎక్కువగా ప్రజల్లో ఉండడంతో ఇక్కడి ప్రజలకు నేరుగా ఎమ్మెల్యేను కలిసే అవకాశం అతితక్కువ అన్న అభిప్రాయం ఇక్కడి ఓటర్లలో విన్పిస్తోంది.
ఇక, కుప్పంలో బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ ఉంది. అయితే.. గతంలో విమానాశ్రయ నిర్మాణానికి భూమి పూజ నిర్వహిం చారు చంద్రబాబు. కానీ, అది ఇప్పటికీ కార్యరూపం దాల్చకపోవడం ఇక్కడి ప్రజలకు కాస్త వెలితిగా కన్పిస్తుంది. అయితే.. వైసీపీ హయాంలో కుప్పంను మున్సిపాలిటీ చేయడంతో గతంలో చంద్ర బాబు ఈ పని ఎందుకు చేయలేకపో యారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే..ఇన్నాళ్లుగా కుప్పం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నా ఇక్కడ చంద్రబాబుకు ఇల్లు లేదన్న విమర్శలు విన్పించడం ఎక్కువ య్యాయి. దీంతో..ఇటీవలె ఓ స్థలం కొని ఇంటి నిర్మాణం చేస్తున్నారు టీడీపీ అధినేత. ఇలాంటివే మరి కొన్ని మైనస్లు ఉన్నాయన్న విమర్శలున్నాయి. అయితే..ఒకటీ అరా మైనస్లు ఉన్నా చంద్రబాబు హయాంలో కుప్పం మాత్రం పెద్ద ఎత్తున అభివృద్ధి చెందిందన్నది నియోజకవర్గ ప్రజల అభిప్రాయం. అందుకే ఇక్కడి ప్రజలు చంద్రబాబుకు వందకు 90 మార్కులు ఇస్తున్నారు. 2019 ఎన్నికల సమయంలో మొదటి రెండు రౌండ్లలో వెనుకపడ్డారు చంద్రబాబు. దీంతో..అప్పట్నుంచి ఆపరేషన్ కుప్పం ప్రారం భించిన వైసీపీ..రానున్న ఎన్నికల్లో టీడీపీ అధినేతను ఓడించేందుకు వ్యూహాలు రచిస్తోంది. మరి.. రాబోయే ఎన్నికల్లో పరిస్థితి ఎలా ఉండబోతోంది అన్నది ఆసక్తి రేపుతోంది.