దేశ రాజధాని ఢిల్లీలో నీటి సంక్షోభాన్ని నివారించాలని కోరుతూ నిరాహార దీక్షకు దిగిన ఆప్ మంత్రి ఆతిషి ఆరోగ్యం అదర్ధరాత్రి క్షీణించింది. దీంతో ఆప్ నేత సంజయ్ సింగ్, ఇతర నేతలు, కార్యకర్తలు ఆమెను లోక్ నాయక్ జైప్రకాష్ నారాయణ్ హాస్పిటల్ కి తరలించారు. ఆతిషి రక్తంలో షుగర్ లెవెల్స్ పడిపోయి 36కు చేరాయని మంత్రి సౌరభ్ భరద్వాజ్ అన్నారు. ప్రస్తుతం ఆమె వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారన్నారు. ఆతిషి ఆరోగ్యం క్షీణించిందని, వెంటనే ఆస్పత్రికి తరలించకపోతే ఆమె పరిస్థితి మరింత విషమించే అవకాశం ఉందని వైద్యులు తెలియజేయడంతో, తాము ఆమెను ఆస్పత్రిలో చేర్చామని ఎంపీ సంజయ్ సింగ్ అన్నారు. ఆతిషి ఢిల్లీ ప్రజల కోసం పోరాడుతున్నారని చెప్పారు. ఢిల్లీ ప్రజలకు హర్యానా నుంచి నీరు అందేలా చూడాలని జూన్ 21 నుంచి జలమండలి మంత్రి ఆతిషి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. జూన్ 21న ఉపవాస దీక్షకు ముందు ఆమె బరువు 65.8 కిలోలు. నిరాహార దీక్ష నాలుగో రోజుకు ఆమె బరువు 63.6 కిలోలకు తగ్గింది. నాలుగు రోజుల్లో రక్తంలో చక్కెర స్థాయి 28 యూనిట్లు తగ్గింది. రక్తపోటు స్థాయి కూడా తగ్గింది. ఇది ప్రమాదకరమని వైద్యులు చెప్పడంతో ఆమెను పార్టీ నేతలు ఆస్పత్రికి తరలించారు.