ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. నాలుగు గంటలకు పైగా చర్చించిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక అంశాలపై నిర్ణయం తీసుకున్నారు. మెగా డీఎస్సీ నిర్వహణ, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ, ల్యాండ్ టైట్లింగ్ చట్టం రద్దు, పెన్షన్ల పెంపు, నైపుణ్యాల గణనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
ముందుగా మెగా డీఎస్సీ నిర్వహణకు వీలుగా కేబినెట్ ఆమోదం తెలిపింది. జూలై 1 నుంచి డీఎస్సీ నిర్వహణ ప్రక్రియ ప్రారంభించాలని డిసెంబర్ 10 కల్లా దీన్ని ముగించాలని నిర్ణయించారు. అలాగే వివాదాస్పద ల్యాండ్ టైట్లింగ్ చట్టాన్ని రద్దు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. అటు రాష్ట్రంలో ఎన్నికల హామీ మేరకు వృద్ధులు, దివ్యాంగులు, ఇతర వర్గాలకు పెన్షన్ల పెంపుకు కూడా మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది.దీంతో పాటు రాష్ట్రంలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మూతపడిన అన్న క్యాంటీన్లను తిరిగి తెరిచేందుకు వీలుగా కేబినెట్ నిర్ణయం తీసుకుంది. త్వరలోనే వీటిని అందుబాటు లోకి తెస్తారు. అలాగే చంద్రబాబు ఐదో సంతకం అయిన నైపుణ్యాల గణన చేపట్టేందుకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. వీటితో పాటు విజయవాడలో ఉన్న వైఎస్సార్ హెల్త్ యూనివర్శిటీ పేరును తిరిగి ఎన్టీఆర్ గా మార్చాలని నిర్ణయించారు.
ఏపీలో గంజాయి నిర్మూలనకు సూచనలు చేసేందుకు ఐదుగురు మంత్రులతో కమిటీ ఏర్పాటు చేస్తూ కేబినెట్ మరో నిర్ణయం తీసుకుంది. ఇందులో మంత్రులు అనిత, లోకేష్, కొల్లు రవీంద్ర, సత్య కుమార్, సంధ్యా రాణి సభ్యులుగా ఉంటారు. పంచాయతీలు, మున్సిపాలిటీల్లో పారిశుధ్య పనులు వెంటనే ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు. పాట్ హోల్స్ ను వెంటనే పూడ్చాలని నిర్ణయించారు. అడ్వకేట్ జనరల్ గా దమ్మాలపాటి శ్రీనివాస్ నియామకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.గత ప్రభుత్వం ఐదేళ్లలో ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ చేయకుండా నిరుద్యోగులను దగా చేసిందని మంత్రి పార్థసారథి ధ్వజమెత్తారు. సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ ప్రకారం మెగా డీఎస్సీ పేరిట అన్ని స్కూళ్లలో 16,347 టీచర్ పోస్టుల భర్తీకి క్యాబినెట్ ఆమోదించిందని వెల్లడించారు. గత ప్రభుత్వం ఐదేళ్లలో ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ చేయలేదు కానీ ఎన్నికల ముందు మాత్రమే డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చిందన్నారు. గత ప్రభుత్వం నిరుద్యోగులకు తీరని నష్టం చేసిందని పార్థసారథి తెలిపారు. మరోవైపు ఏడు ప్రధాన శాఖలపై శ్వేతపత్రాలు విడుదల చేయాలని కేబినెట్ నిర్ణయించింది. పోలవరం, అమరావతి, లిక్కర్, మైనింగ్, ఫైనాన్స్,విద్యుత్ శాఖలపై శ్వేత పత్రాలు విడుదల చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. అలాగే గంజాయి అరికట్టడంపైనా కేబినెట్ లో ప్రధానంగా చర్చ జరిగింది. మరోవైపు సచివాలయ ఉద్యోగుల చేత ఇంటింటికీ పెన్షన్ పంపిణీ చేయించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది.