దక్షిణాఫ్రికాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళుతున్న ఓ బస్సు బ్రిడ్జిపై నుంచి అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 45 మంది మృతిచెందారు. ఈస్టర్ పండుగ కోసం చర్చికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. 165 అడుగుల లోతులో బస్సు పడడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగినట్లు అధికారులు తెలిపారు. మొత్తం 46 మందితో కూడిన బస్సు బోట్స్వానా నుంచి మోరియాకు బయలుదేరింది. ఈ క్రమంలో బస్సు అదుపుతప్పి బ్రిడ్జిపై నుంచి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్ సైతం చనిపోగా.. 8ఏళ్ల బాలిక మాత్రమే ప్రాణాలతో బయటపడింది. ప్రాణాలతో బతికున్న బాలికను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాలిక పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఘటనపై బోట్స్వానా అధ్యక్షుడితో దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా మాట్లాడారు. మృతుల కుటుంబాల కు ఇరుదేశాల అధ్యక్షులు సానుభూతి తెలిపారు.