చాలా రోజుల గ్యాప్ తర్వాత తెలంగాణలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడనుంది. రేపు మూడు నోటిఫికేషన్లను ఇచ్చేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సిద్ధమైంది. వచ్చే వారం రోజుల్లో మరిన్ని నోటిఫికేషన్లు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇక మీదట నియామక పక్రియ అంతా ఆన్లైన్ మోడ్ లోనే జరపాలని కమిషన్ నిర్ణయించింది. దేశంలో నెలకొన్న పేపర్ లీక్ లతో కమిషన్ అప్రమత్తమైంది.
ఈ సందర్భంగా మాట్లాడిన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మెన్ బుర్ర వెంకటేశం… గతంలో పరీక్షలు పెట్టి ఫలితాలు ఇచ్చేందుకు ఏడాది, రెండేళ్లు సమయం పట్టేదని.. ఇక నుంచి సింగిల్ ఎగ్జామ్ కు మూడు నెలల్లోపు నియామక పక్రియ పూర్తి చేస్తామని చెప్పారు. ప్రిలిమ్స్, మెయిన్స్ ఉన్న వాటిని 6 నుంచి 9 నెలల్లో పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. పబ్లిక్ సర్వీస్ మీద ఎలాంటి అపొహలు లేకుండా చూస్తామన్నారు. కమిషన్ మీద జరిగే తప్పుడు ప్రచారాలను నమ్మాల్సిన అవసరం లేదని సూచించారు. పబ్లిక్ సర్వీస్ మీద నమ్మకం కలిగించేలా తాము పని చేస్తున్నామని.. ఆన్లైన్ మోడ్ లో ప్రశ్న పత్రం పేపర్ లీక్ అవ్వడానికి అవకాశాలు తక్కువగా ఉంటాయని చెప్పారు. సాధ్యమైనంత వరకు పరీక్ష రోజే ఫలితాలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. నోటిఫికేషన్, పరీక్షలు, మెరిట్ లిస్ట్, సెలెక్షన్ పక్రియ తొందరగా చేయాలని ప్రయత్నిస్తున్నామన్నారు. నియామక పక్రియ తొందరగా జరగడానికి CBT మోడ్ దోహద పడుతుందని తెలిపారు. ఒకే రోజూ రెండు పరీక్షలు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మెన్ బుర్ర వెంకటేశం.
———-


