ఆంధ్రప్రదేశ్లో అమృత్ పథకం కింద రూ.14 వేల కోట్లతో పలు అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ(P Narayana)తెలిపారు. నెల్లూరులోని 54వ డివిజన్లో నిర్మిస్తున్న 350 కిలోలీటర్ల సామర్థ్యంతో కూడిన మంచినీటి ట్యాంకు పనులకు ఆయన భూమి పూజ నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ… రాబోయే రెండేళ్లలో రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన నదీజలాలను అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. గత ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దెబ్బతీసి వెళ్లిందని విమర్శించిన ఆయన…ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాల్లో ఎలాంటి రాజీ పడటం లేదని స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు (N Chandrababu Naidu) నాయకత్వంలో ప్రజారంజక పాలన కొనసాగుతోందని పేర్కొన్నారు. ప్రతి పేద విద్యార్థికి కార్పొరేట్ స్థాయి విద్యను ఉచితంగా అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు.
అలాగే పీ4 కార్యక్రమం ద్వారా పేదలకు సహాయం అందించేందుకు తన వంతు కృషి చేస్తున్నానని మంత్రి చెప్పారు. విద్యాభివృద్ధి, పేదరిక నిర్మూలన ఒకదానికొకటి అనుసంధానమై ఉన్నాయని, సమగ్ర అభివృద్ధికి విద్యే ప్రధాన ఆయుధమని ఆయన పేర్కొన్నారు.


