హైదరాబాద్ లోని ఉప్పల్ ( Uppal) రింగ్రోడ్డులో భారీ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఉప్పల్ – నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనుల కోసం ట్రాఫిక్ పోలీసులు మూడు నెలల పాటు కీలక మార్గాలను మూసివేశారు. దీంతో ఘట్ కేసర్ (Ghatkesar), వరంగల్ ( Warangal) వైపు వెళ్లే వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాలకు మళ్లిస్తున్నారు.
రింగ్ రోడ్డు నుంచి ఘట్కేసర్, వరంగల్ వెళ్లే ప్రధాన రూట్ను పూర్తిగా మూసివేయడంతో పాటు, ఘట్కేసర్, నారపల్లి, మేడిపల్లి నుంచి ఉప్పల్ రింగ్ రోడ్డుపైకి వచ్చే దారులను కూడా పోలీసులు బ్లాక్ చేశారు. ఎలివేటెడ్ కారిడార్ పిల్లర్ల నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్న నేపథ్యంలో ఈ ఆంక్షలు విధించినట్లు అధికారులు తెలిపారు.
సికింద్రాబాద్(Secunderabad),హబ్సిగూడ( Habsiguda) నుంచి ఘట్కేసర్, వరంగల్ వైపు వెళ్లే వాహనాలను లిటిల్ ఫ్లవర్ కాలేజ్ వెనుక రోడ్డు ద్వారా మళ్లిస్తున్నారు. అలాగే కోఠి( Koti), రామాంతపూర్( Ramanthapur) నుంచి వెళ్లే వాహనాలకు కూడా అదే మార్గాన్ని సూచిస్తున్నారు. మరోవైపు వరంగల్, ఘట్కేసర్ నుంచి ఉప్పల్ రింగ్ రోడ్డుకు వచ్చే వాహనాలను బగాయత్ లేఔట్ మీదుగా డైవర్ట్ చేస్తున్నారు.
ట్రాఫిక్ ఆంక్షలపై సరైన అవగాహన లేకపోవడంతో వాహనదారులు రోడ్లపై అయోమయానికి గురవుతున్నారు. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళల్లో భారీ ట్రాఫిక్ జామ్లు ఏర్పడుతున్నాయి. ప్రత్యామ్నాయ మార్గాలపై స్పష్టమైన సూచనలు లేక చాలామంది ప్రయాణికులు గమ్యస్థానాలకు చేరుకోవడానికి ఎక్కువ సమయం పడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇక TSRTC బస్సుల రూట్లలో మార్పులు రావడంతో ప్రయాణికుల ఇబ్బందులు మరింత పెరిగాయి. యాదాద్రి( Yadadri),జనగాం( Jangaon),హన్మకొండ( Hanamkonda), వరంగల్ వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులు రింగ్ రోడ్డుకు రాకపోవడంతో ప్రజలు అయోమయంలో పడుతున్నారు. పలువురు ప్రయాణికులు ఉప్పల్ నల్ల చెరువు( Uppal Nalla Cheruvu) వరకు నడుచుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.
స్థానికులు, వాహనదారులు ట్రాఫిక్ పోలీసులపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముందస్తు ప్రచారం, స్పష్టమైన డైవర్షన్ బోర్డులు ఏర్పాటు చేసి ఉంటే ఇబ్బందులు తక్కువగా ఉండేవని అంటున్నారు. మరోవైపు నిర్మాణ పనులు పూర్తయ్యాక ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని అధికారులు చెబుతున్నారు.
c


