వైఎస్ జగన్ మళ్లీ తన కుటుంబానికి దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారా? కుటుంబం ఐక్యంగా ఉంటేనే.. ప్రజల్లోకి బలంగా వెళ్లొచ్చని నమ్ముతున్నారా? అంటే అవుననే చెప్పాలి. అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓటమికి ఎన్నో కారణాలు ఉండి ఉండొచ్చు. కానీ వైఎస్ జగన్ ఫ్యామిలీ తన వెంట లేకపోవడం.. చెల్లెళ్లు షర్మిల,సునీతలు అన్న జగన్పై యుద్దం ప్రకటించడం కూడా వైసీపీని దారుణంగా దెబ్బతీసింది. 2019కి ముందు కుటుంబమంతా ఒక్క తాటిపై ఉండి వైసీపీని అధికారంలోకి తీసుకొని రావడానికి కష్టపడ్డారు. వైసీపీ పటిష్టతకు వైఎస్ జగన్తో పాటు విజయమ్మ, షర్మిల కూడా చాలా కష్టపడ్డారు. జగన్కు కుడి, ఎడమ భుజాల్లా తల్లి, చెల్లలు వెన్నంటి ఉన్నారు.
వైసీపీ అధికారంలోకి వచ్చి.. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత వైఎస్ఆర్ ఫ్యామిలీలో లుకలుకలు బయటపడ్డాయి. జగన్తో విభేదించిన షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టడం.. తన అన్నపై మీడియాలో కామెంట్లు చేయడం పెద్ద మైనస్గా మారింది. ఇక 2024 ఎన్నికలకు ముందు ఏపీ పీసీపీ ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టిన షర్మిల.. కేవలం జగన్ టార్గెట్గా రాజకీయాలు చేశారు. అదే సమయంలో విజయమ్మ కూడా కుమారుడిని కాదని.. కూతురుకు సపోర్ట్గా నిలిచారు. ఎన్నికలకు ముందు రిలీజ్ చేసిన వీడియో బైట్ కూడా వైసీపీకి పెద్ద డ్యామేజ్గా మారింది. దీంతో సొంత కడప జిల్లాలో క్లీన్ స్వీప్ చేయాల్సిన వైసీపీ.. మూడు సీట్లకు పరిమితం అయ్యింది. మరోవైపు టీడీపీ కూటమి భారీ విజయం సాధించి.. వైసీపీని 11 సీట్లకు తగ్గించింది.
అసెంబ్లీ ఎన్నికల తర్వాత వైసీపీ నుంచి కీలక నేతలు ఇతర పార్టీల్లో చేరుతున్నారు. పార్టీలో నంబర్ 2గా ఉన్న విజయసాయిరెడ్డి ఏకంగా రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారు. అయితే గతంలో వైఎస్ఆర్కు సన్నిహితంగా ఉన్న కాంగ్రెస్ నాయకులు.. వైసీపీలోకి రావడానికి ఇప్పటికీ వెనుకడుతున్నారు. టీడీపీలోకి వెళ్లలేక.. కాంగ్రెస్లో ఉండలేక ప్రస్తుతానికి సైలెంట్గా ఉన్నారు. అలాంటి వారిని వైసీపీలోకి తీసుకొని రావడానికి జగన్ తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారట. తన ఫ్యామిలీ అంతా ఒక్కటైతే కొంత మంది సీనియర్ నాయకులు వైసీపీలోకి వచ్చే అవకాశం ఉందని జగన్కు కొంత మంది నాయకులు సూచించారట. అంతే కాకుండా కుటుంబం ఏకమైతే ప్రజలు కూడా తిరిగి ఆదరిస్తారని జగన్కు చెప్పారట.
కాంగ్రెస్లో ఉన్న నాయకులే వైఎస్ఆర్ ఫ్యామిలీ ఒక్కటయ్యేలా పావులు కదుపుతున్నట్లు కూడా తెలిసింది. వైసీపీకి మళ్ళీ ఒకనాటి వైభవం వచ్చేలా చేయాలంటే కచ్చితంగా కుటుంబం కలసి ఉండాలని కోరుతున్నారని అంటున్నారు. ఈ మేరకు జగన్ సైతం వాస్తవాలను అర్థం చేసుకున్నారని అందుకే విజయమ్మను సాదరంగా ఆహ్వానించి తొందరలో వైసీపీలో కీలకమైన పదవిని అప్పగిస్తారనే టాక్ వినిపిస్తోంది. విజయమ్మ కూడా కొడుకు ఆహ్వానిస్తే వైసీపీ బాధ్యతలు తీసుకోవడానికి రెడీగానే ఉన్నారనే చర్చ జరుగుతోంది.
చాన్నాళ్లుగా షర్మిల రాజకీయం చేస్తున్నా.. ఆమె ఆశించినంతగా ఎదగక పోవడంతో విజయమ్మ పునరాలోచిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. అందుకే వైసీపీనే తిరిగి బలోపేతం చేస్తే బాగుంటుందని విజయమ్మ భావిస్తున్నారట. గత డిసెంబర్ లో ఇడుపులపాయలో జరిగిన కార్యక్రమంలో జగన్తో కలసి విజయమ్మ పాల్గొన్నారు. అంతే కాదు ఇటీవల జగన్ లండన్ టూర్లో కూడా ఆమె కూడా ఉన్నారని చెబుతున్నారు. షర్మిల, జగన్ల మధ్య విభేదాలు కూడా సమసిపోయేలా ఒకనాటి వైఎస్సార్ మిత్రులు ప్రయత్నాలు చేస్తున్నారట. అన్నీ అనుకున్నట్లు జరిగితే.. విజయమ్మ వైసీపీలోకి రావడం ఖాయమని తెలుస్తోంది. అంతే కాకుండా ఆమెకు కీలక పదవి కూడా ఇస్తారనే టాక్ వినిపిస్తోంది. మరి ఈ విషయంలో ఏం జరుగుతుందో వేచి చూడాలి.