మంగళగిరితో ముడిపడిన బంధం తనను చేనేత కుటుంబ సభ్యుడిని చేసిందని మంత్రి నారా లోకేష్ అన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కళాకారులు అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. చేనేత కళాకారుల కష్టాలు చూశానని.. సమస్యలపై పూర్తి అవగాహన వచ్చిందని లోకేష్ అన్నారు. యువగళం పాదయాత్రలో చేనేత రంగం గురించి అవగాహన కలిగిందని గుర్తు చేశారు. చేనేత రంగం లక్షలాది మంది జీవనానికి ఉపయోగపడుతోందని తెలిపారు. మన సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించే ఓ కళ చేనేత రంగమన్నారు.
చేనేత రంగానికి పూర్వ వైభవం తీసుకొస్తామని పాదయాత్రలోనే మాటిచ్చానునని లోకేష్ అన్నారు. సమాంతరంగా మంగళగిరిలో చేనేతలకు చేయూతనందించే వీవర్స్ పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభించి టాటా తనేరా సంస్థతో అనుసంధానం చేశామన్నారు. పేద చేనేత కళాకారులకు మగ్గాలు, ఇతర సామగ్రి అందించానని చెప్పారు. చేనేత రంగం, కార్మికుల సమస్యలన్నీ శాశ్వత ప్రాతిపదికన పరిష్కరించేందుకు కూటమి ప్రభుత్వం ఓ ప్రణాళిక రూపొందిస్తోందని వెల్లడించారు. మన మంగళగిరి-మన చేనేత అనే నినాదంతో దేశ వ్యాప్తంగా మన చేనేత వస్త్రాలకు బ్రాండింగ్ కల్పిస్తున్నట్లు మంత్రి లోకేష్ తెలిపారు.
ప్రధాని నరేంద్ర మోదీని మంగళగిరి చేనేత కళాకారులు నేసిన శాలువాతో సత్కరించానని అన్నారు. తన తల్లి, భార్య మంగళగిరి చేనేత చీరలు ధరిస్తూ.. మన చేనేత కళకు మరింత ప్రాచుర్యం కల్పిస్తున్నారని తెలిపారు. చేనేతలకు చేయూతనందించడం తమ ప్రభుత్వ ప్రాధాన్యాల్లో ఒకటి అని మంత్రి లోకేష్ అన్నారు.


