తెలంగాణ సెంటిమెంట్తో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి రాష్ట్రాన్ని సాధించిన టీఆర్ఎస్కు బీఆర్ఎస్ కలిసిరా లేదా..? పదేళ్లపాటు అధికార పగ్గాలు చేపట్టి చక్రం తిప్పిన గులాబీ అధినేత ఆ అధికారానికి దూరం అవడానికి బీఆర్ఎస్పేరే కారణమా..? సెంటిమెంట్తో రగిలిపోయే తెలంగాణవాదు లకు భారత రాష్ట్ర సమితి నచ్చడం లేదా..? అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే లక్ష్యంగా పుట్టిన పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి. పద్నాలుగేళ్ల పోరాటం తర్వాత రాష్ట్రాన్ని సాధించడంతో తిరుగులేని శక్తిగా నిరూపించుకుంది టీఆర్ఎస్. 2014, 2018 ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు విజయం సాధించి రాష్ట్రంలో బలమైన రాజకీయ శక్తిగా ఆవిర్భవించింది. ఆ తర్వాత కేసీఆర్కు దేశ రాజకీయాలపై మనసు లాగింది. దీంతో తెలంగాణ మోడల్గా భారత్ను కూడా అభివృద్ధి చేసి చూపిస్తామంటూ అప్పటి వరకూ టీఆర్ఎస్గా ఉన్న పార్టీని, 2022 అక్టోబర్ నెల విజయ దశమి నాడు భారత రాష్ట్ర సమితిగా పేరు మార్చారు. ఆ తర్వాత తాను అనుకున్నట్టు పలు రాష్ట్రాల్లో పార్టీ కార్యక్రమాలతో బిజీ అయ్యారు. మహారాష్ట్ర, ఢిల్లీలో పార్టీ కార్యాలయాలను మొదలు పెట్టారు. ఇదే సమయంలో పార్టీ క్యాడర్ నుంచి పేరు మార్పుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ వచ్చాయి. టీఆర్ఎస్ పేరు మార్చడంతో.. తెలంగాణ ప్రజలకు పార్టీ దూరమైందన్న వాదనను కొంతమంది తెలంగాణ ఉద్యమ కారులు తెరపైకి తెచ్చారు. పార్టీ పేరు మార్పు ప్రభావం ఎన్నికలలో ఉంటుందన్న అనుమానాలు వ్యక్తం చేశారు. పార్టీ జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలన్న లక్ష్యంగా అధినేత కేసిఆర్ తమ నేతల అభ్యంతరాలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. దాదాపు రెండేళ్ల పాటు జాతీయ రాజకీయాలను దృష్టిలో ఉంచుకొని వివిధ రాష్ట్రాల్లో బీఆర్ఎస్ అధినేతగా కెసిఆర్ పార్టీ కార్యక్రమాలను నిర్వహించే యత్నం చేశారు.
అయితే, ఈలోపే అసెంబ్లీ ఎన్నికలకు రావడంతో తొలిసారి బీఆర్ఎస్గా బరిలో దిగింది అధికార పార్టీ. ఈ ఫలితాలు తారుమారయ్యి ఓటమి రుచి చవిచూడాల్సి వచ్చింది. ఆ తర్వాత నుంచి ఒక్కక్కరుగా పార్టీకి గుడ్బై చెప్పడంతో బీఆర్ఎస్ గడ్డుపరిస్థితులను ఎదుర్కొంటోంది. దీంతో మార్పులపై సమీక్షలు నిర్వహిస్తున్న అధిష్టానానికి పార్టీ పేరు మార్చాలంటూ కార్యకర్తలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితిగా మళ్లీ పేరు మార్చాలని డిమాండ్ చేస్తూ పార్టీ పెద్దలకు తమ అభిప్రాయాలను వినిపిస్తున్నారు. దీంతో పార్టీ పేరును మార్చాలన్న చర్చ మొదలైంది. కేసీఆర్ కూడా ఈ అంశాన్ని సీరియస్గా పరిశీలిస్తున్నారు. తెలంగాణ సెంటిమెంట్తో ముడిపడిన పార్టీ పేరును మార్చడంతో తెలంగాణ ప్రజలతో ఎమోషనల్ కనెక్షన్ మిస్ అయినట్లుగా భావిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది.
త్వరలో జరిగే పార్లమెంట్ ఎన్నికలకు బీఆర్ఎస్ పేరుతో కాకుండా టీఆర్ఎస్గానే వెళ్లాలన్న యోచనలో ఉన్నారు గులాబీ శ్రేణులు. అందుకే పార్టీ మార్పు కోసం తొందరపెట్టడంతో ఈ నెల 27న పేరు మార్పు కోసం కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర సమితి 24వ వార్షికోత్సవ వేడుకల సమావేశా ల్లోనే బీఆర్ఎస్ పేరు కాస్తా టీఆర్ఎస్ గా మారుస్తారన్న ప్రచారం సాగుతోంది. అది మంచి ముహూర్తం అని పార్టీ వేదిక మీదనే సర్వ సభ్య సమావేశంలో నిర్ణయం తీసుకుంటే మే నెలలో జరిగే లోక్సభ ఎన్నికల్లో అదృష్టం కలిసిరావచ్చొని, ఎక్కువ సీట్లు సాధించే వీలుంటుందని భావిస్తున్నారు. మొత్తంగా బీఆర్ఎస్ను మళ్లీ టీఆర్ఎస్గా మార్చాలన్న మాట గట్టిగా వినిపిస్తున్న నేపథ్యంలో పార్టీ పేరు మారితే రాజకీయంగా కలిసి వచ్చే అవకాశం ఉందా..? గులాబీ క్యాడర్ ఆశిస్తున్నట్టు లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటుతుందా..? ప్రజలు ముందులా పార్టీని ఆదరిస్తారా అన్నది ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.


