అసెంబ్లీ ఎన్నికల్లో స్వంత పార్టీ వెన్నుపోట్ల వల్ల.. బలమైన అభ్యర్థులు సైతం పరాజయం పాలయ్యారు. అనుకున్న మేర పార్టీ ఫలితాలను సాధించలేకపోయింది. గత అసెంబ్లీ ఎన్నికలపై ఎనాలసిస్ చేసిన బీజేపీ పెద్దల అభిప్రాయం ఇది. రాబోయే ఎంపీ ఎన్నికల్లో ఈ తరహా పరిస్థితులు పునరావృతం కాకుండా పార్టీ అధిష్ఠానం పకడ్బంధీ చర్యలు చేపడ్తున్నట్టు తెలిసింది. ఇందులో భాగంగానే పార్టీ సంస్థాగత ప్రక్షాళనకు స్వీకారం చుడుతోంది.
సంస్థాగత ప్రక్షాళనపై కమలం పార్టీ ప్రత్యేక దృష్టిసారిస్తోంది. ఈ నిర్ణయానికి అసెంబ్లీ ఎన్నికల్లో నేతల పనితీరే కారణ మని తెలుస్తోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలవాల్సిన నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. ఇందుకు జిల్లా అధ్యక్షులు కారణమని అపజయం పాలైన అభ్యర్థులు రాష్ట్ర కమిటీకి ఫిర్యాదు చేశారు. జిల్లా అధ్యక్షుల అసమర్ధత, సమన్వయ లోపమే ఇందుకు కారణమని కొందరు ఓటమి పాలైన అభ్యర్థులు తెలియజే శారు. కొందరు అధ్యక్షులు ఇతర పార్టీల అభ్యర్థులకు అమ్ముడు పోయారని మరికొందరు పరాజయం పాలైన నేతలు ఆరోపించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన జిల్లా అధ్యక్షులపై సీరియస్గా యాక్షన్ తీసుకోవాలని రాష్ట్ర నాయకత్వం నిర్ణయించినట్టు తెలిసింది. పలువురు నేతల సహకారం లేకపోవడం వల్లే ఈ ఓటమి సంభవించిందని కాషాయ పార్టీ పెద్దలు తేల్చారు. ఈనేపథ్యంలో 15 జిల్లాల బీజేపీ అధ్యక్షులను మార్చనున్నట్టు తెలిసింది. అంతేకా కుండా పలువురు రాష్ట్ర పదాధికారులను సైతం మార్చే చాన్స్ ఉందని తెలుస్తోంది. వారితో పాటు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారిపైనా వేటు వేయనున్నట్టు బీజేపీ శ్రేణులో చర్చ జరుగుతోంది.
పార్లమెంట్ ఎన్నికల్లో భారీ స్థాయిలో విజయలను సాధించాలంటే అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన తప్పిదాలను మరోసారి రిపీట్ కానివ్వకుండా చూడాలని పార్టీ భావిస్తోంది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి తన కొత్త టీమ్ ను సిద్ధం చేసు కునే పనిలో నిమగ్నమైనట్టు కమలం పార్టీలో చర్చ జరుగుతోంది. ఇప్పటికే పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులతో భేటీ అయిన కిషన్ రెడ్డి కొత్త వారి నియామకానికి సంబంధించిన జాబితాను సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది. అంతేకాకుండా దీర్ఘకాలంగా జిల్లాలకు అధ్యక్షులుగా కొన సాగుతున్న వారిని పక్కన పెట్టి కొత్త వారికి,యువతకు అవకాశం ఇవ్వాలని పార్టీ భావిస్తోంది. గత ఎన్నికల్లో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారికి తొలుత షోకాజ్ లను జారీ చేయాలని క్రమశిక్షణ కమిటీ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. అసెంబ్లీలో పోటీ చేసిన అభ్యర్థులు, ఇతర నాయకులు ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా జిల్లా అధ్యక్షుల, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై చర్యలను తీసుకోవాలని రాష్ట్ర నాయకత్వం నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.