ఆ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉత్కంఠ పోరుకు తెర దించేది ఎవరు..? బీసీ సామాజిక వర్గానికి చెందిన తలారి రంగయ్య వైసీపీ తరఫున పోటీలో ఉన్నారు. ప్రముఖ కాంట్రాక్టర్, కమ్మ సామాజిక వర్గానికి చెందిన అమిలినేని సురేంద్రబాబు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ నుంచి పి.రాంభూ పాల్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఇంతకీ ఆ నియోజకవర్గం ఏది.? ఇందులో ఎవరు విజయానికి చేరువలో ఉన్నారు. ఎవరు పరాజితులు కాబోతున్నారు.?
ఉమ్మడి అనంతపురం జిల్లాలో కీలకమైన శాసనసభ స్థానం కళ్యాణదుర్గం. టీడీపీకి కంచుకోటగా కళ్యాణదుర్గం నియోజకవర్గాన్ని భావిస్తారు. 2014లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ గెలిచింది. అయితే, 2019 ఎన్నికల్లో మాత్రం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా, ప్రస్తుత మంత్రి ఉష శ్రీచరణ్ విజయం సాధించారు. అనంతపురం వైసీపీ ఎంపీగా పనిచేసిన తలారి రంగయ్య బీసీ సామాజికి వర్గానికి చెందిన నేత. ఆయన వైసీపీ తరఫున ఎన్నికల బరిలోకి దిగారు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన ప్రముఖ కాంట్రాక్టర్ అమిలినేని సురేంద్రబాబు టీడీపీ తరఫున పోటీ చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ నుంచి పి.రాంభూపాల్ రెడ్డి పోటీ చేస్తున్నారు. అయితే, ప్రధానంగా ఇక్కడ పోటీ వైసీపీ, టీడీపీ అభ్యర్థుల మధ్యనే జరగనుంది. వైసీపీ అభ్యర్థి రంగయ్య ప్రభుత్వ పథకాలు, జగన్పైనే ఎక్కువగా ఆశలు పెట్టుకున్నారు. ఎన్నికల ప్రచారంలో వాటినే ప్రజల్లోకి తీసుకెళుతున్నారు. ప్రచారంలోనూ ఆయన ఇదే విషయం చెబుతున్నారు.
ప్రధాన ప్రతిపక్షం టీడీపీ కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఎంతో కాలంగా ఉన్న సీనియర్లను కాదని ప్రయోగం చేసింది. పార్టీ తరఫున ఉన్న సీనియర్ నాయకులు. ఉమామహేశ్వరనాయుడు, ఉన్నం హను మంతరాయ చౌదరిలను పక్కన పెట్టి, ఎస్సార్ కన్ స్ట్రక్షన్ అధినేత అమిలినేని సురేంద్ర బాబును నిలబెట్టింది. అమిలినేని ఆర్థికంగా బలం ఉన్న నేతే కాకుండా, నియోజకవర్గంపై మంచి పట్టు ఉంది. నియోజకవర్గంలో కొన్ని దశాబ్దాలుగా ఆయన సేవలు అందిస్తు న్నారు. నియోజకవర్గంలో ఉన్న సమస్య లను ఆకళింపు చేసుకున్నారు. ఈ విషయాలన్ని పరిగణనలోకి తీసుకుని టీడీపీ అధిష్ఠానం టికెట్ ఆయనకు కేటా యించింది.టీడీపీ నుంచి బరిలో ఉన్న అమలినేని ఆర్థికంగా స్థితిమంతుడుకాగా, వైసీపీ తరఫున పోటీ చేస్తున్న రంగయ్య ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. తాజాగా ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లో ఆయన మొత్తం ఆస్తులను రెండు కోట్ల రూపాయలుగా చూపించారు. రెండు ప్రధాన పార్టీల నుంచి పోటీలో ఉన్న ఇద్దరు నేతలు సైతం. కళ్యాణదుర్గం నియోజకవర్గం నుంచి తొలి సారి పోటీ చేస్తున్నారు. ఇద్దరూ గెలుపు కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.
నియోజకవర్గానికి వెన్నెముకలా భావిస్తున్న బిటిపి ప్రాజెక్ట్ ను పూర్తి చేస్తామని రెండు పార్టీల నేతలు హామీ లు గుప్పిస్తున్నారు. నియోజకవర్గంలోని అన్ని చెరువులను నీటితో నింపి సాగు, తాగు నీటి సమస్య పరిష్కరిస్తామని వైసీపీ, టీడీపీ అభ్యర్థులు విస్తృత ప్రచారం సాగిస్తున్నారు. 2019 లో జరిగిన ఎన్నికల్లో ఇరు ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇదే ప్రధాన హామీతో ప్రజల ముందుకు వెళ్లారు. ఇప్పుడు మరొక సారి ఎన్నికలు కు సిద్దం అయ్యారు. మరలా అదే ప్రధాన హామీతో మరొక్కమారు ప్రజల ముందుకు వెళ్తు న్నారు. టీడీపీ కూటమి నుంచి బరిలో ఉన్న సురేంద్రబాబు, ఆర్థికంగా స్థితిమంతుడు కావడంతో, పనులు పూర్తి చేయాలనే పట్టుదల, హామీ నిలబెట్టుకోవాలనే స్థిర నిశ్చయం ఉంటే, ఈ పనులు పూర్త వుతాయని ప్రజలు భావిస్తున్నారు. ఇంతకు ముందు టీడీపీ ప్రభుత్వంలో కాంట్రాక్టర్ సురేంద్రబాబు బీటిపి పునరుద్ధరణ పనులు, కాలువ పనులు చేపట్టారు. జగన్ సంక్షేమ పథకాలను పరిగణనలోకి తీసుకుని వైసీపీకి పట్టం కడతారో, టీడీపీ అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు కాంట్రాక్టర్ గా చేసిన సేవలు గుర్తించి ఆ పార్టీ వైపు దృష్టి సారిస్తారో, టీడీపీనే గెలిపిస్తారో, వైసీపీనే అందలం ఎక్కిస్తారో అంతా సస్పెన్స్. ఏది ఏమైనా బిటీపీ ప్రాజెక్ట్ కళ్యాణదుర్గం నియోజకవర్గం ప్రజలకు ఓ సుందర స్వప్నం. ఈ కల కల్లలా మిగిలి పోకుండా, ఈ సారి ఎన్నికల్లో గెలిచే ప్రజా ప్రతినిధి అయినా, చెరువులన్నింటికీ నీరు నింపే చర్యలు చేపడ్తారని, నిత్యం కరువుతో పోరాడుతున్న తమను కష్టాల కడలి నుంచి విముక్తి చేస్తారని ప్రజలు ఎదురుచూపులు చూస్తున్నారు.