ఏపీలో ఎన్నికలవేళ … వాలంటీర్ల వ్యవస్థ పై పెద్ద దుమారం చెలరేగింది. చివరకు కేంద్ర ఎన్నికల సంఘం వాలంటీర్లను పెన్షన్ వంటి సేవలకు దూరం పెట్టాలని కొరడా ఝుళిపించడంతో వాలంటీర్ల సేవల నియోగంపై అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఎన్నికల ముందు వాలంటీర్ల సేవల పై విమర్శలు, ప్రతి విమర్శలతో రాజకీయం వేడెక్కింది. తాజాగా వాలంటీర్లు రాజీనామాల బాట పట్టారు.
గత శాసనసభ ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ల వ్యవస్థ పురుడు పోసుకుంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు నేరుగా లబ్దిదారులకు అందించడమే వాలంటీర్ల వ్యవస్థ అసలు లక్ష్యం. గ్రామాల్లో ప్రతి 50 ఇళ్లకు, అలాగే పట్టణాలలో ప్రతి 100 ఇళ్లకు ఒక వాలంటీర్ చొప్పున దాదాపు రెండున్నర లక్షల మందిని రాష్ట్రవ్యాప్తంగా నియమించారు. వాలంటీర్లకు నెలకు ఐదు వేల రూపాయల గౌరవ వేతనం ఇస్తారు. తమ క్లస్టర్ పరిధిలోని ఇండ్లకు సంబంధించి సంక్షేమ పథకాలు అమలు అయ్యేలా చూడడం, లబ్దిదారులకు ప్రభుత్వపరంగా వచ్చే నగదు అందించడం వాలంటీర్ల ప్రధాన పని. అయితే వాలంటీర్ల వ్యవస్థపై తొలిరోజుల్లోనే రాజకీయ విమర్శలు వచ్చాయి. వాలంటీర్ల వ్యవస్థకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర విమర్శలు చేశారు.గౌరవ వేతనం రూపంలో వాలంటీర్ల కు ప్రజాధనం ఇస్తూ వారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు ఉపయోగించుకుంటోందని ప్రతి పక్షాలు ఆరోపించాయి. వాలంటీర్ల ద్వారా ప్రజల సమాచారాన్ని ప్రభుత్వం తెలుసుకుంటోందని పవన్ కల్యాణ్ కూడా ఒకదశలో విమర్శలు చేశారు. వాలంటీర్ల వ్యవస్థను వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం దుర్వినియోగపరుస్తోందని జనసేన అధినేత ఘాటు ఆరోపణలు చేశారు. అంతేకాదు మహిళల అక్రమ రవాణాకు వాలంటీర్ల వ్యవస్థే కారణమని ఆయన ఆరోపించారు.అలాగే ఆంధ్రప్రదేశ్లో మహిళలపై జరుగుతున్న దాడులకు వాలంటీర్లు సేకరించిన సమాచారమే కారణమవుతోందన్నారు జనసేన అధినేత.
వాలంటీర్ల వ్యవస్థపై పవన్ కల్యాణ్ చేసిన విమర్శలు ఆంధ్రప్రదేశ్వ్యాప్తంగా దుమారం రేపాయి. దీంతో పవన్ కళ్యాణ్కు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా వాలంటీర్లు ఆయన దిష్టి బొమ్మలు దగ్ధం చేశారు. అంతే కాదు..పవన్ కళ్యాణ్ పై కేసులు కూడా నమోదయ్యాయి. కాగా వాలంటీర్ల వ్యవస్థపై ఎన్ని విమర్శలు వచ్చినా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఖాతరు చేయలేదు. వాలంటీర్ల వ్యవస్థకు అండగా నిలబడ్డారు. కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో వాలంటీర్లు అందచేసిన సేవలకుగాను వారిని అభినం దించారు. అంతేకాదు ప్రతి ఏడాది వాలంటీర్ల సేవలకు గుర్తింపుగా వారికి నగదు పురస్కారం కూడా అందచేశారు.
శాసనసభ ఎన్నికల నగారా మోగిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలన్నీ వాలంటీర్ల చుట్టూ తిరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వాలంటీర్లు ప్రభుత్వ సొమ్మును గౌరవ వేతనంగా తీసుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారని ప్రతిపక్ష నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు లు చేశారు. అంతేకాదు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ముగిసే వరకు ప్రభుత్వ పథకాలు వాలంటీర్ల ద్వారా కాకుండా ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా లబ్దిదారులకు అందించాలని ఈసీకి విజ్ఞప్తులు వెళ్లాయి. దీంతో వాలంటీర్ల సేవలకు సంబంధించి, కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. వాలంటీర్ల ను ఎన్నికల విధుల నుంచి తప్పించింది. అలాగే ప్రభుత్వ పథకాల పంపిణీకి వాలంటీర్లు దూరంగా ఉండాలని ఆదేశించింది.ఫలితంగా ప్రతినెలా వాలంటీర్ల ద్వారా జరుగుతున్న పెన్షన్ పంపిణీకి తాజాగా బ్రేకులు పడ్డాయి.
ప్రతినెలా అందే పెన్షన్ సొమ్ములపై ఆధారపడ్డ కుటుంబాలు ఇప్పుడు ఆందోళన పడుతున్నాయి. సచివాలయాల దగ్గర వృద్ధులు పడిగాపులు పడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. కాగా కాకినాడ రూరల్ తూరంగిలో పెన్షన్ అందలేదన్న బాధతో కే. వెంకట్రావు అనే వృద్ధుడు గుండె ఆగి మరణించినట్లు సమాచారం. అలాగే పెన్షన్ అందకపోవడంతో మనస్తాపానికి గురైన తిరుపతి జిల్లా వెంకటగిరి బంగారు పేటలో 80 ఏళ్ల వెంకటయ్య మృతి చెందినట్లు సమాచారం. మొత్తంమీద వాలంటీర్ల రాజీనామాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హల్చల్ చేస్తున్నాయి.