- వైభవంగా స్ఫూర్తి కుటుంబం తెలంగాణ ట్రస్ట్ వార్షికోత్సవం
- మానవ శ్రేయస్సు కోసం జీవితాన్ని అంకితం చేసిన గురుదేవులు

విశ్వస్పూర్తి కుటుంబం తెలంగాణ ట్రస్ట్ వేడుకలు హైదరాబాద్లో వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో భాగంగా చంపాపేట్లో రథయాత్ర కోలాహలంగా జరిగింది. అంతకుమునుపు ట్రస్ట్ ఆఫీస్లో గురుపూజ, 108 సార్లు మూల మంత్రోచ్చారణ నిర్వహించారు. అనంతరం ప్రథమ వార్షికోత్సవ వేడుకలు వైభవంగా సాగాయి. వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి.
సత్యం కోసం అన్వేషణ సాగిద్దాం, ఇందుకోసం గురు విశ్వ స్ఫూర్తి తో పయనం సాగిద్దాం… ఈ భావనతో నడుస్తున్న ప్రముఖ ఆధ్యాత్మిక స్వచ్ఛంద సంస్థ శ్రీ శ్రీ శ్రీ గురు విశ్వస్ఫూర్తి … సమాజంలో చక్కటి ఆధ్యాత్మిక స్ఫూర్తిని నింపుతోంది. ప్రజల్లో స్వచ్ఛతను, ప్రశాంతతను నింపేందుకు పాటుపడుతున్న ఈ ఆధ్యాత్మిక ఒరవడిలో పూర్ణ గురువులు, ఆధ్యాత్మిక విశ్వ గురువులు, సైంటిఫిక్ సెయింట్, ప్రాక్టికల్ ఫిలాసఫర్ శ్రీ శ్రీ శ్రీ గురు విశ్వస్ఫూర్తి దివ్య ఆశీస్సులతో స్ఫూర్తి కుటుంబం తెలంగాణ ట్రస్ట్ ముందుకు సాగుతోంది. స్ఫూర్తి కుటుంబం తెలంగాణ ట్రస్ట్ ప్రారంభమై ఏడాది పూర్తయిన సందర్భంగా వార్షికోత్సవ వేడుకలను హైదరాబాద్లోని చంపాపేట్లో ఘనంగా జరుపుకొన్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా గురుదేవుల స్ఫూర్తిని అంతా స్మరించుకొన్నారు.

బాల్యం నుంచి గురుదేవులు జీవితం మొత్తం మానవ జాతి శ్రేయస్సుకు అంకితం చేశారు. ఆయన ఆజన్మ బ్రహ్మచారి. ఆయన వయసు భౌతికంగా 82 సంవత్సరాలు. ఈ కాలంలో జనబాహుళ్యంలోకి వారు రావడం చాలా తక్కువ. సాధించుకున్న పూర్ణత్వ స్థితి నుంచి వేరొక ప్రదేశంలోని ఉన్న మామూలు వ్యక్తిలోకి సూక్ష్మరూపంలో ప్రవేశించి మీడియంగా చేసుకుని.. కులమత వయో లింగబేధం లేకుండా అందర్నీ ఆశీర్వదిస్తుంటారు. మనిషి మంచిగా మారాలంటే ధ్యానం ఒకటే మార్గమని.. ధ్యానంలో చెడును నిర్లక్ష్యం చేసి మంచిని పెంచుకొంటాం… మంచిని పది మందికీ పంచడం ద్వారా మన సంస్కారాన్ని.. మన సమాజంలో ఉన్న చెడును ప్రక్షాళన చేయగలుతామన్నది గురువర్యుల ఆశయం.

హైదరాబాద్ లోని చంపాపేట్ సామ సరస్వతి గార్డెన్స్లో జరిగిన స్ఫూర్తి కుటుంబం తెలంగాణ ట్రస్ట్ ప్రథమ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు. ఇందులో హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రామలింగేశ్వరరావు, రిటైర్డ్ అడిషనల్ డీజీపీ గోపీనాథ్ రెడ్డి, ఉస్మానియా యూనివర్శిటీ తెలుగు శాఖాధిపతి డాక్టర్ కుసుమ అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గురు దేవుల సందేశాన్ని చదివి వినిపించారు. ట్రస్ట్ ఈ ఏడాది కాలంలో చేపట్టిన కార్యక్రమాలు, పనులకు సంబంధించి వార్షిక నివేదికను చదివి వినిపించారు. ట్రస్ట్ ప్రథమ వార్షికోత్సవ వేడుకలకు స్ఫూర్తి కుటుంబం సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. సభను ప్రారంభిస్తూ గురు దేవులు స్ఫూర్తి కుటుంబం ట్రస్ట్ ఏర్పాటు చేసుకోడానికి అనుమతి.. దివ్వ ఆశీస్సులను అందజేసి ఏడాది పూర్తయ్యిందని వక్తలు ప్రసగించారు. ఇది ఒక అద్భుత కార్యక్రమం అని, ప్రశాంత మార్గంలో ముందుకు సాగేందుకు ఒరవడి అని విశ్లేషించారు.

ముఖ్య అతిథి హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రామలింగేశ్వరరావు మాట్లాడుతూ.. తాను ఈ విధంగా ఈ కుటుంబంలో సభ్యుడ్ని అవుతానని అనుకోలేదన్నారు. ఆధ్యాత్మిక ప్రయాణంలో సందేహాలు, సమస్యలతో ముందుకెళ్తున్నానని చెప్పారు. ఇప్పుడిప్పుడే జ్ఞానోదయమైందని భావిస్తున్నాను అని చెప్పారు. ఇప్పటికీ ఈ రోజు నడిపించే శక్తిగా గురువుగారినే భావిస్తానని అన్నారు. గురువుగారు చెప్పే విషయాలు తనకు నచ్చుతాయని చెప్పారు. వ్యక్తి చాలా ముఖ్యం.. వ్యక్తి మారకపోతే సమాజం మారదు.. నువ్వు హిందువా? క్రిస్టియనా? ముస్లిమా? అనేది అనవసరం.. నువ్వు మనిషివైతే మానవత్వాన్ని చూడు. ఆ మానవత్వం గురించి చెప్పే వ్యక్తి గురు విశ్వస్ఫూర్తి అని రామలింగేశ్వర రావు విశదీకరించారు.

గురుదేవులు రాసిన పుస్తకాలను పూర్తిగా చదివి అర్ధం చేసుకోవడం సులభం కాదని, ఎందుకంటే వారి రాతలు, వారి మాటలు, వారి వాక్యాలను పూర్తిగా అర్ధం చేసుకోవడం చాలా కష్టం.. మనం కూడా ఆ స్థితికి చేరుకుంటేనే గురువుగారి భావాలను అర్థం చేసుకోలేమని సభకు అధ్యక్షత వహించిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి డాక్టర్ గోపీనాథ్ రెడ్డి పేర్కొన్నారు. మనస్సును జయించినవాడే జీవితంలో సాఫల్యం పొందుతాడు.. ఇంద్రియాలను జయించగలిగిన వారే జీవిత సాఫల్యాన్ని పొందుతారని గురుదేవుల సందేశమని వివరించారు.