ఎన్నికల రేసు నుంచి తప్పుకున్న తరువాత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తొలిసారిగా జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. దేశాన్ని, పార్టీని ఒక్కతాటిపైకి తెచ్చేందుకు తాను తప్పుకున్నట్టు తెలిపారు. పార్టీ బాధ్యతలను యువతరానికి బదిలీ చేయాల్సిన సమయం వచ్చిందని వ్యాఖ్యానించారు. అధ్యక్ష అభ్యర్థిగా కమలా హారిస్కు ఇది వరకే మద్దతు తెలిపిన బైడెన్ తాజాగా ప్రసంగంలో ఆమెపై ప్రశంసలు కురిపించారు. ఆమె కచ్చితమైన, సమర్థురాలైన ఉపాధ్యక్షురాలని కొనియాడారు. ప్రమాదంలో పడ్డ ప్రజాస్వామ్య పరిరక్షణ ముందు ఏ పదవీ ఎక్కువ కాదని బైడెన్ అన్నారు. బాధ్యతలను తరువాతి తరానికి అందించాలని నిర్ణయించానని చెప్పారు. దేశాన్ని ఏకం చేసేందుకు, యువ గొంతులు వినిపించేందుకు ఇదే సరైన మార్గం అని బైడెన్ తెలిపారు.


