దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు ప్రాంతాల్లోకి పెద్ద మొత్తంలో వరదనీరు వచ్చి చేరింది. గత 24 గంటల్లో సఫ్దార్జంగ్లో 228.1 మిల్లీమీటర్ల వాన పడింది. నిన్న రాత్రి కేవలం 3 గంటల వ్యవధిలో 148.5 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. చాలా కాలనీల్లో విద్యుత్తు సరఫరా నిలిచి పోయింది. రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్లు ఏర్పడ్డాయి. ఇందిరాగాంధీ విమానాశ్రయంలో రాకపోకల పై ప్రతికూల ప్రభావం చూపింది. చాలా విమాన సర్వీసుల్లో జాప్యం చోటుచేసుకొంది. దక్షిణ ఢిల్లీలో గోవింద పురి ప్రాంతంలో వరద నీరు భారీగా చేరడంతో వాహనాలు నిలిచిపోయాయి. తీన్మూర్తి మార్గంలో కూడా వరద నీరు భారీ స్థాయిలో చేరింది.మింటో రోడ్డులో ఓ ట్రక్కు పూర్తిగా నీట మునిగింది. మరో వారం రోజులపాటు ఇక్కడ వాతావరణం మేఘావృతమై ఉంటుందని అధికారులు వెల్లడించారు. ఎల్లుండి భారీ వర్షం కురిసే అవకాశం ఉందన్నారు.నగరంలో చాలా ట్రాఫిక్ సమస్యలు తలెత్తడంతో ట్రాఫిక్ పోలీసులు ఇబ్బందికరమై న మార్గాల వివరాలను ఎక్స్లో పోస్టు చేశారు. శాంతివన్ నుంచి ISBT వరకు అవుటర్ రింగ్రోడ్డు రెండువైపులా ప్రయాణించలేని పరిస్థితి నెలకొందని చెప్పారు. అనువర్త మార్గంలో కూడా ట్రాఫిక్కు ఇబ్బందిగా ఉందని పేర్కొన్నారు. విమానాశ్రయంలో టెర్మినల్-1 పైకప్పులో కొంతభాగం తెల్ల వారుజామున కుప్పకూలింది. ట్యాక్సీలు సహా పలు కార్లపై పడటంతో ఓ వ్యక్తి మృతి చెందగా ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.