అన్నదాతల చలో ఢిల్లీ కార్యక్రమం రెండురోజులు వాయిదా పడింది. పంటలకు కనీస మద్దతు ధర కోసం కదం తొక్కిన రైతులు,ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. పంజాబ్-హర్యానా సరిహద్దులో పోలీసులతో ఘర్షణ జరిగిన నేపథ్యంలో రైతు సంఘాల నేతలు ఈ నిర్ణయం తీసుకున్నారు. రైతన్నల ఉద్యమంపై హర్యానా పోలీసలు ఉక్కుపాదం మోపారు. పోలీసు తూటాలు శుభ్కరణ్ సింగ్ అనే యువ రైతును బలిగొన్నాయి. పంజాబ్ – హర్యానా సరిహద్దుల్లోని ఖనౌరీ ప్రాంతంలో ఈ దారుణం జరిగింది. అన్నదాతల అందోళనలతో ఖనౌరీ ప్రాంతం యుద్ధభూమిని తలపించింది. ఢిల్లీ చలో ఆందోళన ప్రారం భమయ్యాక వరుస ఘర్షణలు సంభవించాయి. అయితే ఈ ఘర్షణల్లో చోటు చేసుకున్న తొలి మరణం శుభ్కరణ్ సింగ్ అనే యువ రైతుదే.
ఖనౌరీ ప్రాంతంలో అన్నదాతల ఆందోళన ఉవ్వెత్తున ఎగసింది. అయితే ఈ ఆందోళనను అణచివేయడానికి పోలీసుల బాష్పవాయువు ప్రయోగించారు. అన్నదాతలను చెల్లదీనికి కౌంటర్గా రైతులు రాళ్లు రువ్వారు. దీంతో ఒక్కసారిగా హింస చెలరేగింది. ఈ హింస ఒక యువరైతును బలికొనగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. హర్యానా పోలీసులు తమపైకి బాష్పవాయు గోళాలతో పాటు రబ్బరు తూటాలను కూడా ప్రయోగించారని ఖనౌరీ వద్ద నిరసనల్లో పాల్గొన్న రైతులు తెలిపారు. మరోవైపు నిరసనకారులు తమపైకి రాళ్లురువ్వారని పోలీసులు పేర్కొన్నారు. అన్నదాతలు రాళ్లురువ్విన కారణంగా 12మంది సిబ్బంది గాయపడ్డారని హర్యానా పోలీసులు తెలిపారు. దీంతో ఆత్మరక్షణార్థం పోలీసులు కాల్పులు జరపవలసి వచ్చిందన్నారు.అంతేకాదు ఆందోళనకారులు లాఠీలతో తమపైకి దాడి చేశారని పోలీసులు పేర్కొన్నారు. ఒక దశలో బలగాలను చుట్టుముట్టి, పంటవ్యర్థాలపై కారం చల్లి నిప్పంటిం చారని హర్యానా పోలీసులు ఆరోపించారు. ఇదిలాఉంటే, ఖనౌరీ ప్రాంతంలో ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో హర్యానాలోని ఏడు జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు.
ఖనౌరీ-శంభు సరిహద్దుల్లో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రైతులపై హర్యానా పోలీసులు దౌర్జన్యానికి పాల్పడ్డారని రైతు నేత సర్వన్ సింగ్ పందేర్ ఆరోపించారు. ఈ ఘటనను తాము ఖండిస్తు న్నామన్నారు. శుభ్కరణ్ సింగ్ మృతి ఘటన దేశవ్యాప్తంగా రైతులోకాన్ని కలచివేసిందని పందేర్ పేర్కొ న్నారు. ఈ నేపథ్యంలోనే అన్నదాతల ఆందోళనకు రెండు రోజులపాటు విరామం ప్రకటించా మన్నారు. ఈ విరామంలో పోలీసుల హింసల గాయపడిన అలాగే తప్పిపోయిన అన్నదాతల కుటుంబ సభ్యులను కలుస్తామన్నారు. శుభ్కరణ్ సింగ్ కుటుంబసభ్యులను పరామర్శి స్తామని పందేర్ చెప్పారు. ఆందోళన లో పాల్గొన్న రైతులు రహదారిని అడ్డుకున్నారని చెప్పడం కరెక్ట్ కాదన్నారు. ఈ సందర్భంగా పోలీసులు అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని సర్వన్ సింగ్ పందేర్ ఆరోపించారు.
శుభ్కరణ్ సింగ్ మృతి ఘటన నేపథ్యంలో శాంతియుతంగా ఉండాలంటూ రైతు సంఘాల నేతలు పిలుపునిచ్చారు. బారికేడ్లను దాటి ముందుకెళ్లరాదంటూ యువరైతులకు రైతుసంఘాలు నియమించిన పలువురు వాలంటీర్లు సూచిం చారు. రైతుల ఆందోళనను పక్కదారి పట్టించడానికి కొన్ని విద్రోహ శక్తులు ప్రయత్నిస్తున్నాయని రైతు నాయకు డు జగ్జీత్ సింగ్ దల్లేవాల్ ఆరోపించారు. ఈ విద్రోహ శక్తుల విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని అన్నదాతలను జగ్జీత్ సింగ్ దల్లేవాల్ కోరారు. శాంతి భద్రతలకు భంగం కలిగించడం అన్నదాతల ఉద్దేశం కాదన్నారు. తమ న్యాయ మైన డిమాండ్ల సాధన కోసం శాంతియుతంగా ఢిల్లీ వెళుతున్న రైతులను ఇబ్బంది పెట్టాలని హర్యానా పోలీసులు నిర్ణయించు కున్నట్లు తెలుస్తోందన్నారు.
ఇదిలాఉంటే శుభ్కరణ్ సింగ్ మృతి ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ తెలిపారు. రైతు మృతి ఘటనపై విచారణ జరిపిస్తామన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు భగవంత్ మాన్. కాగా నిరసనకారులకు పంజాబ్ సర్కార్ అండగా నిలుస్తుంద న్నారు. పంటలకు కనీస మద్దతు ధర కల్పించాలంటూ ఫిబ్రవరి 13వ తేదీ నుంచి అన్నదాతలు రైతు చలో ఆందోళనను చేపట్టారు. ఈ ఆందోళనలకు పంజాబ్ – హర్యానా రాష్ట్రాల సరిహద్దుల్లోని శంభు, ఖనౌరీల ప్రాంతాలు ఈ ఆందోళనలకు వేదికలయ్యాయి. రైతన్నలు చేస్తున్న ఆందోళనల విషయంలో ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరించింది. చర్చలంటూ రైతు సంఘాల నేతలను పిలిపించింది. ఒకటికాదు…రెండు కాదు…మొత్తం నాలుగుసార్లు రైతు సంఘాల నేతలతో ప్రభుత్వం చర్చలు జరిపింది. అయితే నాలుగుసార్లు జరిగినా చర్చలు ఫెయిల్ అయ్యాయి. దీనికి కారణం రైతుల డిమాండ్లపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడమే అంటున్నారు రైతు సంఘాల నేతలు. అంతేకాదు చర్చల పేరుతో కాలయాపన చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని రైతు సంఘాల నేతలు ఆరోపించారు.