ఏపీలో అభివృద్ధిని పరుగులు పెట్టించేందుకు కూటమి సర్కారు అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ప్రజా రవాణాలో అత్యంత కీలకంగా మారిన మెట్రో వ్యవస్థను విశాఖ, విజయవాడలో ఏర్పాటు చేసేందుకు శరవేగంగా అడుగులు వేస్తోంది. తొలిదశ డీపీఆర్లకు సైతం రాష్ట్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. ఆంధ్రప్రదేశ్లో ప్రజా రవాణా వ్యవస్థకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది కూటమి సర్కారు. ఇందులో భాగంగా విశాఖ, విజయవాడలో ఏర్పాటు చేయనున్న మెట్రోకు సంబంధించి కీలక అడుగులు పడ్డాయి. రాష్ట్రంలో అత్యంత ప్రధానమైన నగరాలైన విశాఖ, విజయవాడలో మెట్రోరైలు ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి తొలిదశ డీపీఆర్లను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. విశాఖలో తొలిదశలో భాగంగా 46.23 కిలోమీటర్ల మేర మూడు కారిడార్లు నిర్మించాలని నిర్ణయించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
విజయవాడ మెట్రో రైలు డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్కు ఆమోదముద్ర వేశారు సీఎం చంద్రబాబు నాయుడు. రెండు దశల్లో మొత్తం 38.4 కిలోమీటర్ల మేర ప్రాజెక్టు నిర్మాణం బెజవాడలో చేపట్టనుంది కూటమి ప్రభుత్వం. ఇందుకు సంబందించిన డీపీఆర్ను మెట్రో రైల్ కార్పొరేషన్ రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించగా ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ సర్కారు.
ఏపీలో అతిపెద్ద నగరంగా ఉన్న విశాఖపై కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. నగరాభివృద్ధిలో భాగంగా మెట్రో రైలు డీపీఆర్కు ఓకే చెప్పడంతో ఇప్పుడు అలైన్మెంట్పై చర్చ మొదలైంది. విశాఖలో చేపట్టనున్న మొదటి దశ ప్రాజెక్టులో భాగంగా 46.23 కిలోమీటర్ల మేర మెట్రో రైలు పరుగులు తీయనుంది. మొత్తం మూడు కారిడార్లు రానున్నాయి. స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాది, గురుద్వార నుంచి పాత పోస్టాఫీస్, తాటిచెట్లపాలెం నుంచి చినవాల్తేరు మార్గాల్లో మెట్రో రైలు దూసుకెళ్లనుంది. మొదటి కారిడార్ 34.40 కిలోమీటర్ల మేర ఉండనుంది. స్టీల్ప్లాంట్ నుంచి కొమ్మాది వరకు ఉండే ఈ లైనులో మొత్తం 29 స్టేషన్లు రానున్నాయి. స్టీల్ప్లాంట్, గాజువాక, బీహెచ్పీవీ, ఏర్పోర్ట్, ఎన్ఏడీ, కంచరపాలెం, గురుద్వారా, జూపార్క్, ఎండాడ, క్రికెట్ స్టేడియం నుంచి కొమ్మాది వరకు ఈ కారిడార్ ఉండనుంది.
రెండో కారిడార్ 5.08 కిలోమీటర్ల మేర మాత్రమే ఉండనుంది. గురుద్వార నుంచి పాతపోస్టాఫీస్ వరకు ఉండే ఈ మార్గంలో ఆరు స్టేషన్లు రానున్నాయి. ద్వారకానగర్, ఆర్టీసీ కాంప్లెక్స్, డాగా గార్డెన్స్ నుంచి పాతపోస్టాఫీస్ వరకు ఈ లైన్ ఉంటుంది. ఇక, మూడో కారిడార్లో భాగంగా తాటిచెట్ల పాలెం నుంచి చినవాల్తేరు వరకు మెట్రో రైలు మార్గం నిర్మించనున్నారు. ఇందులో 7 స్టేషన్లు రానున్నాయి. రైల్వే న్యూకాలనీ, రైల్వే స్టేషన్, ఆర్టీసీ కాంప్లెక్స్, ఏయూ మీదుగా చినవాల్తేరు వరకు మూడో కారిడార్ ఏర్పాటు చేస్తారు. విశాఖ మెట్రోకు సంబంధించి తొలిదశలో భాగంగా మొత్తం 11 వేల 498 కోట్ల రూపాయలు ఖర్చవుతాయని అంచనా వేస్తోంది ప్రభుత్వం. రెండో దశలో భాగంగా కొమ్మాది నుంచి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వరకు భవిష్యత్లో మెట్రో రైలు సౌకర్యం కల్పించాలని భావిస్తోంది కూటమి సర్కారు.
విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్ట్కు సంబంధించి తొలిదశకు సైతం ఆమోదముద్ర వేసింది ప్రభుత్వం. డీపీఆర్ను ఆమోదించిన కూటమి సర్కారు.. ప్రతిపాదనలను కేంద్రానికి పంపేందుకు రాష్ట్ర మెట్రో రైల్ కార్పొరేషన్కు అనుమతిచ్చింది. తొలిదశ కోసం 11 వేల 9 కోట్ల రూపాయల మేర ఖర్చు అవుతుందని అంచనా వేస్తోంది ప్రభుత్వం. విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులో భాగంగా చేపట్టనున్న రెండు కారిడార్లను ఓసారి పరిశీలిస్తే.. మొదటి కారిడార్ గన్నవరం నుంచి పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ వరకు ఉండనుంది. రెండో కారిడార్ పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి పెనమలూరు వరకు నిర్మిస్తారు. విజయవాడ మెట్రో రెండో దశలో భాగంగా పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి అమరావతిలోని రిజర్వాయర్ స్టేషన్ వరకు నిర్మించాలని భావిస్తోంది ఏపీ సర్కారు.