తెలంగాణ రాష్ట్రం రాజకీయం ప్రస్తుతం హీరో అల్లు అర్జున్ వ్యవహారం చుట్టూ తిరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ప్రతిపక్షాల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వస్తూనే ఉన్నాయి. తాజాగా మాజీ మంత్రి హరీశ్ రావు అల్లు అర్జున్ను రేవంత్ రెడ్డి పర్సనల్గా టార్గెట్ చేస్తున్నాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతులు, ఆటో డ్రైవర్లు చనిపోతే రేవంత్ రెడ్డికి మాట్లాడటానికి సమయం లేదు కానీ ఫిల్మ్ ఇండస్ట్రీని టార్గెట్ చేయడానికి మాత్రం సమయం ఉందని హరీష్ రావు ఫైర్ అయ్యారు.
సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాట ఘటనను కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని పెద్దగా చేస్తుందని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఆరోపించారు. అల్లు అర్జున్పై పెట్టిన కేసు చాలా చిన్నదని.. ఇది రాష్ట్రంలోని ఇతర చిన్న కేసుల్లాంటిదేన్నారు. సంధ్య థియేటర్ ఘటనపై ప్రతిపక్షాలు రాజకీయం చేయడం మానుకోవాలని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. సామాజిక, సందేశాత్మక చిత్రాలకు సెన్సార్ బోర్డు అనుమతులు ఇవ్వకుండా.. పోలీసు వ్యవస్థను అణచివేసే విధంగా రౌడీయిజాన్ని ప్రోత్సహించే సినిమాలకు అనుమతులు ఇవ్వడం శోచనీయం అని కూనంనేని అన్నారు.