దేశంలో పెరుగుతున్న దిగుమతులు, విదేశీ వస్తువుల వినియోగంపై ప్రధాని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ దుమారం రేపుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో ప్రధాని ప్రజలను ఉద్దేశించి చేసిన పిలుపుపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో స్పందిస్తున్నాయి. ఈ క్రమంలో లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ( Rahul Gandhi) కేంద్ర ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. ప్రధాని చేస్తున్న అభ్యర్థనలు వాస్తవానికి ప్రభుత్వ వైఫల్యాలకు చిహ్నమని ఆయన ఎద్దేవా చేశారు.
హైదరాబాద్లో జరిగిన సభలో ప్రధాని ప్రజలను ఉద్దేశించి స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాలని, అవసరం లేని విదేశీ వస్తువుల కొనుగోళ్లను తగ్గించాలని సూచించిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన రాహుల్ గాంధీ సోషల్ మీడియా వేదిక X లో కేంద్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు.
“12 ఏళ్ల పాలన తర్వాత ప్రజలు ఏమి కొనాలి, ఏమి కొనకూడదు అని చెప్పే స్థితికి ప్రభుత్వం రావడం దురదృష్టకరం” అంటూ రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ప్రజల ఆదాయాలు పెంచడం, ఉద్యోగ అవకాశాలు కల్పించడం, దేశీయ పరిశ్రమలను బలోపేతం చేయడం ప్రభుత్వ బాధ్యత అని, కానీ ఆ దిశగా చర్యలు తీసుకోవడంలో కేంద్రం విఫలమైందని ఆరోపించారు.
ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోవడం, నిరుద్యోగం పెరగడం, చిన్న వ్యాపారాలు సంక్షోభంలో పడటం వంటి సమస్యలను పరిష్కరించకుండా కేవలం అభ్యర్థనలతో బాధ్యత నుంచి తప్పించుకోవాలని ప్రభుత్వం చూస్తోందని రాహుల్ విమర్శించారు. దేశ ఆర్థిక పరిస్థితిపై ప్రజల్లో పెరుగుతున్న ఆందోళనలను కూడా ఆయన ప్రస్తావించారు.
కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ప్రధాని వ్యాఖ్యలపై విమర్శలు కొనసాగిస్తున్నారు. దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహించడం మంచిదేనని, కానీ దానికి ముందు ప్రజలకు ఆర్థిక భద్రత, ఉపాధి, కొనుగోలు సామర్థ్యం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని అంటున్నారు.
ఇక ఇతర ప్రతిపక్ష పార్టీలు కూడా కేంద్ర ప్రభుత్వ విదేశాంగ విధానం, ఇంధన నిర్వహణపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఇరాన్ యుద్ధ ప్రభావాన్ని ముందుగానే అంచనా వేసి చర్యలు తీసుకోవాల్సిందని, ఇప్పుడు ప్రజలపై భారం మోపేలా సూచనలు చేయడం సరైంది కాదని మండిపడుతున్నాయి
ప్రతిపక్షాల విమర్శలు తిప్పికొడుతున్న బీజేపీ
ఇక అధికార బీజేపీ నేతలు మాత్రం ప్రతిపక్ష విమర్శలను తిప్పికొడుతున్నారు. దేశ ఆర్థిక స్వావలంబన కోసం స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించడం అవసరమని, ప్రధాని చేసిన పిలుపు దేశ ప్రయోజనాల కోసమేనని చెబుతున్నారు. విదేశీ దిగుమతులపై ఆధారాన్ని తగ్గించడం ద్వారా దేశీయ పరిశ్రమలకు ఊతం లభిస్తుందని బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం నెలకొన్న సమయంలో దేశ ప్రయోజనాల కోసం ప్రజలు సహకరించాలని ప్రధాని కోరడం సహజమేనని చెబుతున్నారు. ఇంధన వినియోగాన్ని తగ్గించడం ద్వారా ఆర్థిక ఒత్తిడిని తగ్గించవచ్చని పేర్కొంటున్నారు.
ప్రధాని ఏం సూచనలు చేశారు?
పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల ప్రభావం భారత్పై పడే అవకాశాల నేపథ్యంలో ప్రధాని ప్రజలకు పలు సూచనలు చేశారు. అవసరం లేని విదేశీ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని, వీలైన చోట్ల వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని అమలు చేయాలని, మెట్రో రైళ్లు, కార్పూలింగ్, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచాలని సూచించారు. ఇంధన వినియోగంలో మితవాదం పాటించాలని కూడా పిలుపునిచ్చారు.
1.. పెట్రోల్, డీజిల్ ను పరిమితంగా వినియోగించండి
2..ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగించండి
3..దుబారా ఖర్చులు తగ్గించుకోవాలి, ఆడంబరాలకు పోవద్దు
4..విదేశీ ప్రయాణాలు తగ్గించుకోవాలి
5..ఏడాది పాటు బంగారం కొనకుండా శపథం చేయాలి
6..వంట నూనె వాడకం తగ్గించుకోవాలి
7..ఎరువులు, రసాయనాలు వినియోగం సగానికి సగం తగ్గించండి
8..ఆన్ లైన్ మీటింగ్ లు, వర్క్ ఫ్రమ్ హోమ్ కి ఏర్పాట్లు చేసుకోండి
9…గుండు సూది నుంచి ప్రతిదీ విదేశీ వస్తువులు కొనొద్దు
ప్రస్తుతం ప్రధాని వ్యాఖ్యలు, రాహుల్ గాంధీ ప్రతిస్పందనతో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. ఈ అంశం రానున్న రోజుల్లో జాతీయ రాజకీయాల్లో మరింత చర్చకు దారితీసే అవకాశం కనిపిస్తోంది.


