ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నివాసాలను ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించిన ఫొటోలను ఆయన ‘ఎక్స్’ (X) వేదికగా పంచుకున్నారు.
చంద్రబాబు నివాసానికి వెళ్లిన సందర్భంగా ఆయనతో పాటు కుటుంబ సభ్యులను కలిసినట్లు ప్రధాని తెలిపారు. వారందరిని కలవడం, అలాగే పలు విభిన్న అంశాలపై అభిప్రాయాలను పంచుకోవడం ఎంతో ఆనందంగా అనిపించిందని పేర్కొన్నారు.



అదే విధంగా పవన్ కల్యాణ్ను పరామర్శించి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నానని మోదీ చెప్పారు. పవన్ సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ పోస్టు చేశారు.

ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో ప్రధాని నరేంద్ర మోదీ భేటీపై తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి నెలకొంది. తెలంగాణ గడ్డపై ఏపీ నేతలతో భేటీతో మోదీ మార్క్ మ్యాజిక్ కనిపించింది. చంద్రబాబు నివాసానికి వెళ్లిన మోదీ.. ఆయనతో గంటకు పైగా చర్చించారు. సుదీర్ఘంగా పీఎం, ఏపీ సీఎం చర్చలు కొనసాగాయి.
హైదరాబాద్ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్రమోదీ ఇవాళ రాష్ట్ర రాజధానికి వచ్చారు. హెచ్ ఐసీసీలో పలు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాల అనంతరం ప్రధాని… ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నివాసాలకు వెళ్లి వారిని కలిశారు. జూబ్లీహిల్స్లో ఉన్న వారి ఇళ్లకు వెళ్లిన ప్రధాని ముందుగా పవన్ కల్యాణ్ను పరామర్శించారు.

ఇటీవల సైనస్ సమస్య కారణంగా పవన్ కల్యాణ్కు శస్త్రచికిత్స జరిగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన విశ్రాంతి తీసుకుంటుండగా, ప్రధాని మోదీ స్వయంగా ఆయన నివాసానికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

అనంతరం ప్రధాని చంద్రబాబు నాయుడు నివాసానికి చేరుకున్నారు. అక్కడ చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ ప్రధానికి ఆత్మీయ స్వాగతం పలికారు. గంటకు పైగా అక్కడ గడిపిన మోదీ, చంద్రబాబుతో పలు కీలక అంశాలపై చర్చలు జరిపినట్లు సమాచారం. రాష్ట్రాభివృద్ధి, కేంద్ర-రాష్ట్ర సంబంధాలు, ప్రస్తుత రాజకీయ పరిణామాలపై వారి మధ్య సమాలోచనలు జరిగినట్లు తెలుస్తోంది.


