జూన్ 4న వెలువడిన మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ నీట్ యూజీ 2024 ఫలితాల్లో హర్యాణాలోని ఓకే ఎగ్జామ్ సెంటర్ కి చెందిన ఆరుగురితో సహా 67 మందికి మొదటి ర్యాంకు వచ్చింది. సిలబస్ మార్పు లపై అభ్యర్థనలు రావడం వల్ల 1563 మంది విద్యార్థులకు గ్రేస్ మార్కులు కలిపారు.
వైద్య విద్యలో విద్యార్థులకు ప్రవేశం కల్పించేందుకు నిర్వహించే ప్రవేశ పరీక్షే ఎంట్రన్స్ టెస్ట్ నీట్. నీట్లో మొదటి ర్యాంకు సాధించిన 67 మందిలో ఆరుగురు, హరియాణాలోని ఒకే పరీక్షా కేంద్రంలో పరీక్ష రాశారు. ఎన్ని ప్రశ్నలకు, ఎన్ని మార్కులనే లెక్కలకు అంతుచిక్కని రీతిలో కొందరు విద్యార్థులు మార్కు లు సాధించారు.మే 5వ తేదీన నీట్ పరీక్ష జరిగింది. పరీక్షకు దాదాపు 24 లక్షల మంది దరఖాస్తు చేసుకు న్నారు. వారిలో 23.33 లక్షల మంది పరీక్షకు హాజర య్యారు. పరీక్ష ఫలితాలను జూన్ 14న ప్రకటించాల్సి ఉండగా, అంతకంటే 10 రోజుల ముందే జూన్ 4న ప్రకటించారు. ఇదే మొదటగా అనుమానాలకు తావిచ్చిందని అంటున్నారు.
జూన్ 4న వచ్చిన ఫలితాల ప్రకారం, 67 మంది టాప్ స్కోర్ సాధించారు, అంటే 720కి 720 మార్కులు. ఇంతమంది టాప్ స్కోర్ సాధించడం ఇదే మొదటిసారి. 2023లో ఇద్దరికి మాత్రమే 720కి720 మార్కులు రాగా, 2022లో ఎవరూ పూర్తి మార్కులు సాధించలేదు. ఆ ఏడాది టాపర్లు 720 మార్కులకి గానూ 715 మాత్రమే సాధించగలిగారు. కొందరు విద్యార్థు లకు 720 మార్కులకి గాను 718, 719 మార్కులు వచ్చాయి. నిజానికి అది సాధ్యం కాదు. ఒక్కో జవాబుకి 4 మార్కులు ఉంటాయి, ఒకవేళ అది తప్పు సమాధానం అయితే ఒక నెగెటివ్ మార్కు ఉంటుంది. సరైన సమాధానం రాయనందుకు 4 మార్కులు, తప్పు సమాధానం రాసినందుకు ఒక నెగెటివ్ మార్కు కలిపి 5 మార్కులు కోల్పోతారు. అలాంటప్పుడు, ఒక విద్యార్థి అన్ని ప్రశ్నలకు సరైన సమాధానాలు రాసి, ఒక్క ప్రశ్నకు తప్పుడు జవాబు రాసినా అతనికి 715 మార్కులు మాత్రమే వస్తాయి. వీటితోపాటు పేపర్ లీక్ ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇప్పటికే బిహార్లో ఇదే విషయమై ఎఫ్ఐఆర్ నమోదు చేసి 13 మందిని అరెస్టు చేశారు. ఈ కేసును దర్యాప్తు చేసేందుకు బిహార్ పోలీసు శాఖ ఆర్థిక నేరాలవిభాగం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది.కాగా నీట్ పరీక్షలో అవకతవకలు జరిగాయని విద్యార్థులు దేశవ్యాప్తంగా నిరసలు వ్యక్తం చేస్తున్నారు.
పరీక్షకు సంబంధించి వచ్చిన ఆరోపణలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఖండించింది. ఫలితాలను వీలైనంత త్వరగా విడుదల చేయడమే తమ విధానమని, ఈసారి 30 రోజుల్లోనే పూర్తి చేయగలిగామని ఎన్టీఏ పేర్కొంది. కొందరు అభ్యర్థులు పరీక్షా సమయం కోల్పోయినందున 1563 మందికి అదనపు మార్కులు ఇచ్చినట్లు తెలిపింది. కొన్ని పరీక్షా కేంద్రాల్లో పరీక్ష ప్రారంభంలో ఆలస్యం జరిగిందని, దీంతో పరీక్షా సమయాన్ని కోల్పోయామంటూ కొందరు అభ్యర్థులు రిట్ పిటిషన్లు దాఖలు చేశారు. అందువల్ల సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి, అధికారులతో చర్చించిన అనంతరం పరీక్షా సమయం కోల్పోయిన అభ్యర్థులకు అదనపు మార్కులు కేటాయించినట్లు ఎన్టీఏ పేర్కొంది. కామన్ లా అడ్మిషన్ టెస్టు సందర్భంగా పరీక్షా సమయం కోల్పోయిన విషయంలో, సుప్రీం కోర్టు సూచించిన ఫార్ములానే ఇప్పుడు కూడా వర్తింపజేసినట్లు తెలిపింది. అందువల్లే, విద్యార్థులకు 718, 719 వంటి మార్కులు వచ్చాయి. అలా అదనపు మార్కుల కారణంగా ఆరుగురు 720 మార్కులు సాధించారని తెలిపింది. అలాగే, ఫిజిక్స్లో ఒక ప్రశ్నకు రివిజన్ మార్కులు రావడం వల్ల మరో 44 మందికి 720 మార్కులు వచ్చాయని పేర్కొంది. పేపర్ లీక్ వంటిదేదీ జరగలేదని ఎన్టీఏ కొట్టిపారేసింది. మరోవైపు ఈ పరీక్షలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై నిజనిజాలు తేల్చేందుకు యూపీఎస్సీ మాజీ ఛైర్మన్ నేతృత్వంలో నలుగురు సభ్యులతో కూడిన కమిటీ వేయాలని నిర్ణయించినట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డీజీ సుబోధ్కుమార్ సింగ్ తెలిపారు. 1563 మంది అభ్యర్థులకు ఇచ్చిన గ్రేస్ మార్కులను కమిటీ సమీక్షించి వారం రోజుల్లో నివేదిక ఇస్తుందని, తర్వాత వారి ఫలితాలను సవరించే అవకాశం ఉంటుందని తెలిపారు.ఈ అంశాన్ని రాజకీయ పార్టీలు కూడా లేవనెత్తాయి. నీట్ అవకతవకలపై విచారణ జరిపించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఈ విషయాన్ని పార్లమెంట్లో ప్రస్తావిస్తామని రాహుల్ గాంధీ అన్నారు. దీంతో ఇప్పుడు నీట్ పరీక్షా వ్యవహారం పొలిటికల్ టర్న్ తీసుకుంది.