రాజస్థాన్లోని కోట సమీపంలో ఢిల్లీకి వెళ్తున్న రాజధాని ఎక్స్ప్రెస్ రైలులో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం ఉదయం రైలులోని ఎయిర్ కండీషన్డ్ కోచ్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అయితే ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని అధికారులు తెలిపారు.
ఉదయం సుమారు 5:15 గంటల సమయంలో కోటలోని విక్రమ్గఢ్ అలోట్ రైల్వే స్టేషన్ సమీపంలో 68 మంది ప్రయాణికులు ఉన్న బీ-1 కోచ్లో మంటలు ప్రారంభమయ్యాయి.
ప్రమాదం జరిగిన వెంటనే రైల్వే అధికారులు అప్రమత్తమై మంటలు అంటుకున్న కోచ్ను రైలు నుంచి వేరు చేశారు. అలాగే భద్రతా చర్యల్లో భాగంగా ఓవర్ హెడ్ ఎలక్ట్రిక్ సప్లై (OHE)ను నిలిపివేశారు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల్లో వేరు చేసిన బోగీ నుంచి భారీగా నల్లటి పొగలు ఎగసిపడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. మంటలు రైల్వే ట్రాక్ సమీపంలోని చెట్లకు కూడా వ్యాపించాయి.
రైలులోని ప్రయాణికులందరినీ సురక్షితంగా బయటకు దింపిన అధికారులు, వారి ప్రయాణం కొనసాగేందుకు ఇతర బోగీల్లో సీట్లు ఏర్పాటు చేశారు.
ఈ అగ్నిప్రమాదానికి గల కారణాలపై రైల్వేశాఖ దర్యాప్తు చేపట్టింది.
12431 రాజధాని ఎక్స్ప్రెస్ శుక్రవారం కేరళలోని తిరువనంతపురం నుంచి బయలుదేరి, ఆదివారం మధ్యాహ్నం 12:30 గంటలకు ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్కు చేరాల్సి ఉంది. ప్రమాదం జరిగే సమయానికి రైలు సుమారు 2,600 కిలోమీటర్ల ప్రయాణం పూర్తి చేసింది.


